బాబు అక్రమ ఆస్తులపై తీర్పు18కి..

5 Jan, 2021 08:07 IST|Sakshi

మరోసారి తీర్పు వాయిదా వేసిన ఏసీబీ ప్రత్యేక కోర్టు 

సాక్షి, హైదరాబాద్‌ : అక్రమ ఆస్తులు కూడబెట్టాడంటూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్‌లో సోమవారం తీర్పు ఇవ్వాల్సి ఉన్నా.. న్యాయమూర్తి మరోసారి వాయిదా వేశారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై ఏసీబీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ లక్ష్మీపార్వతి 2006లో ఏసీబీ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సవాల్‌ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించి స్టే ఉత్తర్వులు పొందారు. అయితే ఆరు నెలలకు మించి స్టే ఉత్తర్వులు కొనసాగడానికి వీల్లేదని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించిన నేపథ్యంలో... ఈ ఏడాది మొదట్లో ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది. చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు కూడబెట్టారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో ఈ కేసును దర్యాప్తు చేసేలా ఏసీబీని ఆదేశించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది నివేదించారు. (దేవుడు చేసిన మనుషుల్లారా మీపేరేమిటి?)

దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఈ పిటిషన్‌పై ఆదేశాలు ఇవ్వాల్సి ఉన్నా... పలుమార్లు వాయిదాపడుతూ వస్తోంది. దీంతో ఎంపీ, ఎమ్మెల్యే అవినీతిపై దాఖలైన పిటిషన్లను రోజువారీ పద్ధతిలో విచారించాలని ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించిందని, ఈ నేపథ్యంలో ఈ పిటిషన్‌పై వెంటనే తీర్పును వెలువరించాలని లక్ష్మీపార్వతి తరఫు న్యాయవాది పలుమార్లు ఏసీబీ ప్ర త్యేక కోర్టుకు విజ్ఞప్తి చేశారు. అయితే సుప్రీం తీర్పు ఈ పిటిషన్‌కు వర్తించదని, కేసులు నమోదై న్యాయ స్థానాల్లో విచారణ పెండింగ్‌లో ఉన్న వాటికే ఆ తీర్పు వర్తిస్తుందని స్పష్టం చేసిన న్యాయమూర్తి... ఈ పిటిషన్‌పై తీర్పును 18కి వాయిదా వేశారు. 

మరిన్ని వార్తలు