సాక్షి, రాజన్న సిరిసిల్ల: మాడపల్లి యువతి కిడ్నాప్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. తండ్రితో కలిసి వేకువ ఝామున గుడికి వెళ్లిన యువతిని అపహరించుని వెళ్లారు దుండగులు. ఈ ఘటన సీసీటీవీ ఫుటేజీ ద్వారా వైరల్ అవుతోంది. అయితే.. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన సొంత నియోజకవర్గ జిల్లా పరిధిలో జరిగిన ఈ ఘటన గురించి.. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమన్న ఆయన.. కిడ్నాప్ నిందితులను సాయంత్రంలోగా పట్టుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ఎవరిని ఉపేక్షించొద్దని సూచించారాయన.
ఇదిలా ఉంటే.. చందుర్తి మండలం మూడపల్లీ గ్రామ యువతి కిడ్నాప్ ఉదంతం కలకలం సృష్టించింది. ఎంగేజ్మెంట్ అయిన మరునాడే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గతంలో బాధితురాలిని ప్రేమ పేరుతో వేధించిన యువకుడే.. ఈ నేరానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు.