ప్రేమజంట ఆత్మహత్యాయత్నం: ఎంత చెప్పినా వినలేదు!

17 Mar, 2021 15:54 IST|Sakshi

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, యువతి మృతి

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందు తాగి  ఓప్రేమ జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సిరికొండ మండలం పందిమడుగు గ్రామంలో రెండో రోజుల క్రితం ప్రేమికులు మనోవేదనతో బలవన్మరణానికి యత్నించారు. వీరిని కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం ప్రియురాలు వందన మృతి చెందింది. ప్రియుడు సుబాష్ పరిస్థితి విషమంగా ఉంది.

అయితే ఈ ఘటనకు సంబంధించి ఓ వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియో ప్రకారం.. పురుగుల మందు తాగిన అనంతరం ప్రేమికుల జాడ కనుగొన్న ఓ వ్యక్తి.. అక్కడకు చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించే యత్నం చేశాడు. సేవించిన పురుగుల మందు కక్కాలని సూచించగా ప్రేమికులిద్దరూ తిరస్కరించారు. అలాగే మొండికేసుకుని కూర్చుంటే చనిపోతారని హెచ్చరించినా పట్టించుకోలేదు. తాము చనిపోయేందుకు సిద్ధమని వారు ఆ వ్యక్తికి బదులిచ్చారు. 

​కాగా సిరికొండ మండలం పందిమడుగు గ్రామానికి చెందిన వందన, చింతల్ తండాకు చెందిన సుభాష్ కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే సుభాష్‌కు 2 నెలల క్రితమే వేరే అమ్మాయితో వివాహం జరిగింది. తనను కాకుండా మరొకరిని పెళ్లి చేసుకున్నాడని యువతి సుభాష్‌ను నిలదీసింది. అనంతరం ఇద్దరు కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు