మహాలక్ష్మీ పథకం ప్రారంభం.. మహిళలకు ఉచిత ప్రయాణం

9 Dec, 2023 13:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఎన్నికల హామీల్లో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. అసెంబ్లీ  వద్ద ఆర్టీసీ బస్సుల్లో మహిళలు, యువతులు ఉచితంగా ప్రయాణించే మహాలక్ష్మి పథకాన్ని సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లాంఛనంగా ప్రారంభించారు. అలాగే, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ(చేయూత)ని ప్రారంభించిన సీఎం, మంత్రులు. 

దీంతో, ఈరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి మహాలక్ష్మీ పథకం అమలులోకి రానుంది. తెలంగాణలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. అసెంబ్లీ ఆవరణలో మూడు బస్సులు ప్రారంభమయ్యాయి. ఇక, ఆరోగ్యశ్రీ కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్యఖర్యులను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయ తీసుకుంది. మంత్రులు సీతక్క, కొండా సురేఖ పచ్చజెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. 

ఈ సందర్బంగా సీఎం రేవంత్‌ మాట్లాడుతూ.. నేడు సోనియా గాంధీ పుట్టినరోజు. డిసెంబర్‌ 9 తెలంగాణకు పండుగ రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను సోనియా నెరవేర్చారు. నాది తెలంగాణ అని చెప్పుకునే అవకాశాన్ని సోనియా మనకు ఇచ్చారు. మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాం. తెలంగాణవ్యాప్తంగా మహాలక్ష్మీ పథకం అమలులోకి వస్తుంది. ఆరు గ్యారంటీల్లో భాగంగా రెండు గ్యారంటీలను అమలుచేస్తున్నాం అని అన్నారు. 

అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ మంత్రులు, మహిళ నేతలు బస్సులో ట్యాంక్‌ బండ్‌కు బయలుదేరారు. దీంతో, అక్కడ సందడి వాతావరణం చోటుచేసుకుంది. ఇక, నేటి మధ్యాహ్నం నుంచి మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేయవచ్చు.

నిఖత్‌ జరీన్‌కు ప్రోత్సాహకం..
అలాగే, బాక్సర్‌ జఖర్‌ ఘరీన్‌కు రూ. 2కోట్ల చెక్‌ను సీఎం రేవంత్‌ అందించారు. ⁠ వరల్డ్ చాంపియన్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు పారిస్ ఒలింపిక్స్ సన్నద్ధత కోసం రూ.2 కోట్ల చెక్ అందించిన సీఎం రేవంత్ రెడ్డి.

>
మరిన్ని వార్తలు