రాహుల్‌ యాత్రకు మహిళా లోకం తరలిరావాలి 

16 Oct, 2022 02:38 IST|Sakshi
రాహుల్‌ యాత్ర ఫ్లెక్సీతో సునీతారావు, పార్టీ మహిళా కార్యకర్తలు 

మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీతారావు

సాక్షి, హైదరాబాద్‌: ఈనెల 23 నుంచి తెలంగాణలో జరగనున్న రాహుల్‌గాంధీ భారత్‌జోడో యాత్రకు మహిళాలోకం పెద్ద ఎత్తున తరలిరావాలని రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు ఎం.సునీతారావు కోరారు. ఈ మేరకు మహిళా కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి యాత్రలో భారీ సంఖ్యలో మహిళలు పాల్గొనేలా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. భారత్‌జోడో యాత్ర విజయవంతం కోసం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న సునీతారావు శనివారం గాంధీభవన్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళా కాంగ్రెస్‌ నేతలతో భేటీ అయ్యారు.

రాహుల్‌గాంధీ పాదయాత్ర హైదరాబాద్‌ నుంచి సాగనున్న నేపథ్యంలో వేల సంఖ్యలో మహిళలు ఆయనకు స్వాగతం పలికి యాత్రలో పాలుపంచుకోవాలని, తెలంగాణ మహిళా లోకం ఆశీర్వదించాలని కోరారు. ప్రతి రోజూ కనీసం 5వేల మంది మహిళలు రాహుల్‌తో కలిసి యాత్రలో పాల్గొనేలా చూడాలని మహిళా కాంగ్రెస్‌ నేతలను సునీతా రావు కోరారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మచ్చ వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్టేట్‌కోఆర్డినేటర్‌ నీలం పద్మ, ఇన్‌చార్జి సదాలక్ష్మి, సునీతారెడ్డి, లావణ్య, షబానాబేగం, షనాజీ బేగం తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు