ఏడేళ్లలో పాతబస్తీ అభివృద్ధికి రూ. 14,887 కోట్లు: కేటీఆర్‌ 

5 Oct, 2021 08:38 IST|Sakshi

అభివృద్ధిలో ఎలాంటి వివక్ష లేదు

ములుగులో కాంగ్రెస్‌ గెలిచినా జిల్లా కేంద్రం చేశాం

పాతబస్తీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు పనులు చేపడతాం

మెట్రోరైలు కరోనా కారణంగా ఆలస్యం

పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన చర్చకు మంత్రి కేటీఆర్‌ సమాధానం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి కె. తారక రామారావు స్పష్టం చేశారు.  పాతబస్తీ అభివృద్ధికి ఏడేళ్లలో రూ. 14,887 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఖర్చు చేసిన మొత్తం రూ. 3, 934 కోట్లు మాత్రమేనని అన్నారు. సోమవారం శాసనసభలో పాతబస్తీ అభివృద్ధిపై జరిగిన చర్చలో పాల్గొన్న విపక్ష నేతలు అక్బరుద్దీన్‌ ఒవైసీ, భట్టి విక్రమార్క,, రాజాసింగ్‌తో పాటు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ లేవనెత్తిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత పాత నగరంలో ఇప్పుడు జరిగినంత అభివృద్ధి గతంలో ఎన్నడూ లేదన్నారు.
చదవండి: మొక్కల కన్నా ముస్లింలు హీనమా?

పాత బస్తీ అభివృద్ధికి జీహెచ్‌ఎంసీ ద్వారా రూ. 9,899 కోట్లు,, వాటర్‌బోర్డు ద్వారా రూ. 3,784 కోట్లు కాగా, ఇతర ఐదు శాఖల నుంచి మరో 1,193 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. హైదరాబాద్‌ విస్తరించుకుంటూ పోతుందని, పాత నగరం 102 చదరపు కిలోమీటర్ల పరిధి ఉండగా, ప్రస్తుతం అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ నగరం 675 చ.కిలోమీటర్లకు విస్తరించిందన్నారు. పెరిగిన హైదరాబాద్‌తో పాటు పాత నగరాన్ని కూడా ఎలాంటి వివక్ష లేకుండా అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్‌డీపీ) కింద పాతబస్తీ రోడ్లను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం రూ. 456 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినట్లు తెలిపారు. సమగ్ర రోడ్డు నిర్వహణ ప్రాజెక్టు (సీఆర్‌ఎంపీ) కింద 154 కిలోమీటర్ల మేర విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 118 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు.
చదవండి: మూసీపై నిర్మించనున్న వంతెనలకు కొత్త అందాలు

పాతబస్తీ పరిధిలోని 8 నియోజకవర్గాల్లో సీఆర్‌ఎంపీ, ఎస్‌ఆర్‌డీపీ ల కింద ప్రతి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని, అదనంగా రెగ్యులర్‌ రోడ్డు ఇంప్రూవ్‌మెంటు కింద మరో రూ. 63 కోట్లతో పనులు చేస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఆర్‌డీపీ కింద నిర్మిస్తున్న రోడ్లకు భూసేకరణ కోసమే రూ. 494 కోట్లు ఖర్చు చేశామన్నారు. కొత్తగా 9 రహదారులను కూడా విస్తరించాలని నిర్ణయించినట్లు చెప్పారు.మూసీ నది మీద 14 కొత్త బ్రిడ్జిలు నిర్మించాలని నిర్ణయించామని, త్వరలో ఈ పనులు మొదలవుతాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.
చదవండి: బాబోయ్‌..ఇదేం రోడ్డు? వెళ్లాలంటేనే దడ పుడుతోంది!

నాలాల అభివృద్ధి పనులు
గత సంవత్సరం వచ్చిన వరదలతో మూసీ వల్ల భవిష్యత్‌లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రణాళికలు రూపొందించినట్లు వివరించారు. అలాగే ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలను కూడా రూ. 19.30 కోట్లతో నిర్మించనున్నట్లు చెప్పారు. చార్మినార్‌ పాదచారుల ప్రాజెక్టు (సీపీపీ) కింద చార్మినార్‌ చుట్టుపక్కల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. సర్ధార్‌ మహల్‌ అభివృద్ధి, కిల్వత్‌ దగ్గర మల్టీ లెవల్‌ పార్కింగ్‌ , లాడ్‌ బజార్‌కు మెరుగులు వంటి పనులు చేయాల్సి ఉందన్నారు. నాలాల అభివృద్ధి పనులు వ్యూహాత్మక నాలాల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఎన్‌డీపీ) కింద చేపట్టినట్లు చెప్పారు. 10 కిలోమీటర్ల మురికినాలను విస్తరించే పథకం కింద ఇప్పటి వరకు 8 కిలోమీటర్ల మేర  3వేల ఆక్రమణలను తొలగించామని, మరో 2 కిలోమీటర్ల విస్తరణ మిగిలి ఉందన్నారు.
చదవండి: Telangana Assembly: ప్రతీకార రాజకీయాలను నమ్మం.. 

ప్రస్తుతం రూ. 242 కోట్లతో ఎస్‌ఎన్‌డీపీ ప్రాజెక్టు నడుస్తుందన్నారు. మొదటి దశలో రూ. 858 కోట్లు సిటీలో ఇందుకోసం వెచ్చిస్తుండగా, పాతబస్తీకే రూ. 261 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. పాతబస్తీలో నైట్‌ షెల్టర్స్‌ ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పీఎం స్వనిధి పథకం కింద పాతబస్తీలో 38,4/99 మంది స్ట్రీట్‌ వెండర్స్‌ను గుర్తించామని, వీరందరికి రూ. 10 వేల చొప్పున కేంద్రం రుణం ఇస్తుందని అన్నారు. వైద్యం, విద్యకు సంబంధించి ఎంతో చేశామని, బస్తీ దవాఖానాల ద్వారా ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇచి్చనట్లు చెప్పారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా పాతబస్తీలో ఆసుపత్రులలో ప్రసవాలు 68 శాతం పెరిగిందని అన్నారు.  

ఓల్డ్‌సిటీకి మెట్రో వస్తుంది... 
పాతబస్తీకి మెట్రోను తీసుకురావడంలో జరిగిన ఆలస్యానికి కోవిడ్‌ విజృంభన కారణమని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. పాతబస్తీలో మెట్రోకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తన అధ్యక్షతన ఓ కమిటీ వేశారని, త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు చెప్పారు. త్వరలోనే మెట్రో పాతబస్తీలో పరుగులు పెడుతుందన్నారు.  

కుతుబ్‌షాహీ టూంబ్స్‌కు ప్రపంచ గుర్తింపు
రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని , అదే తరహాలో హైదరాబాద్‌ నగరానికి కూడా ఓ అంతర్జాతీయ గుర్తింపు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కుతుబ్‌షాహీలకు చెందిన ఏడు సమాధులకు కూడా ప్రపంచ వారసత్వ గుర్తింపు తీసుకొచ్చేందుకు , తద్వారా పర్యాటకంగా హైదరాబాద్‌ను ఉన్నత స్థితికి తీసుకురానున్నట్లు చెప్పారు. 

విపక్ష ఎమ్మెల్యే ఉన్నా...  ములుగును జిల్లా చేశాం.. 
అభివృద్ధి పనులు జరిగేటప్పుడు కారు గుర్తు ఎమ్మెల్యేనా... కార్వాన్‌ ఎమ్మెల్యేనా అని చూడడం లేదని అన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ములుగు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపిస్తే జిల్లా కేంద్రం చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అక్కడ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే గెలిచినా... ఇచ్చిన మాటకు కట్టుబడి ములుగును జిల్లా చేసిన విషయాన్ని గుర్తు చేశారు.  

మరిన్ని వార్తలు