సాక్షి, హైదరాబాద్: తన మాటలతో గంగపుత్రుల మనసు బాధించి ఉంటే తాను క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధిశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మంత్రి వ్యాఖ్యలపై కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా గంగపుత్రులు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాసాబ్ట్యాంక్లోని తన కార్యాలయంలో మత్స్యశాఖ అధికారులు, గంగపుత్ర సంఘం ప్రతినిధులతో మంత్రి మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న కోకాపేటలో ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్లను ఉత్తేజపరిచే విధంగా మాట్లాడానే తప్ప ఎవరినీ బాధ పెట్టే విధంగా ప్రసంగించలేదని సంఘం ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకురాగా.. వాటి పరిష్కారానికి చర్య లు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు.