కొత్త ఇల్లు కట్టుకున్నాం.. ఇంట్లోకి రానివ్వం

17 Feb, 2021 08:45 IST|Sakshi

జగిత్యాల‌: రేకుల షెడ్డు వేస్తామంటూ ఉన్న ఇంటిని కూల్చేసి కొత్తగా ఇల్లు కట్టుకున్న తనయులు.. వృద్ధులైన తల్లిదండ్రులను రోడ్డున పడేశారు. ఐదు రోజులుగా కొడుకుల ఇంటి ఎదుటే రోడ్డు పక్కన ఆ వృద్ధ దంపతులు నరకయాతన అనుభవిస్తున్నారు. జగిత్యాల మండలం తక్కళ్లపల్లికి చెందిన బుచ్చిరెడ్డి, బుచ్చమ్మ దంపతులు తమకున్న ఐదెకరాల వ్యవసాయ భూమిని ఇద్దరు కొడుకులకు పంచారు. మరో 1.10 ఎకరాలు తామే సాగు చేసుకుంటున్నారు.

రెండేళ్ల క్రితం వీరికి రేకుల షెడ్డు వేయిస్తామని చెప్పిన కొడుకులు పాత ఇంటిని కూల్చేసి కొత్త ఇల్లు కట్టుకున్నారు. తల్లిదండ్రులను ఇంట్లోకి రానీయకపోవడంతో ఆ వృద్ధ దంపతులు రెండేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. అయితే, ఈ మధ్య అద్దె ఇంటి యజమానులు వారిని ఖాళీ చేయించగా.. కుమారులు కూడా ఇళ్లలోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్ధులు గ్రామంలోని జగిత్యాల–ధర్మపురి ప్రధాన రహదారి పక్కన సామగ్రి పెట్టుకుని అక్కడే వంట చేసుకుంటూ బతుకీడుస్తున్నారు. 

మరిన్ని వార్తలు