మబ్బులు చెదిరి..నిప్పులు కురిసి..

21 Sep, 2023 02:18 IST|Sakshi

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిపోయిన ఉష్ణోగ్రతలు 

సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదు 

మళ్లీ వానలు మాయం..ఎండాకాలం తరహాలో ఉక్కపోత 

మరో నాలుగైదు రోజులు ఇదే తరహా వాతావరణం 

ఈ నెల 28 తర్వాత వర్షాలు పడే అవకాశం 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో వాతావరణం మళ్లీ ఎండాకాలంలా మారిపోయింది. ఈసారి వానాకాలం మొదట్లో చినుకు జాడ లేక, తర్వాత భారీ వర్షాలు కురిసి.. ఆగస్టులో అయితే నెలంతా వానలు పడక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఈ నెల మొదట్లో మంచి వర్షాలే పడినా.. మళ్లీ వాతావరణం భిన్నంగా మారిపోయింది.

సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోతతోనూ ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే నాలుగు రోజులుగా ఈ పరిస్థితి ఉండగా.. మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వాతావరణమే ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. 

మబ్బులు మాయమై.. 
సాధారణంగా వానాకాలం చివరిలో తేలికపాటి వర్షాలే కురిసే పరిస్థితి ఉన్నా.. ఆకాశం మేఘావృతమై కనిపిస్తుంటుంది. రుతుపవనాల కదలిక ఎక్కు­వగా ఉంటే భారీ వర్షాలు కూడా పడుతుంటా­యి. కానీ ఇప్పుడు వాతావరణం ఇందుకు భిన్నంగా ఉంది. ఆకాశంలో మబ్బులు కానరావడం లేదు.

ఎక్కువై ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా­యి. వాతావరణంలో తేమశాతం ఎక్కువై ఉక్కపోత పెరిగిందని వాతావరణ నిపుణులు చెప్తున్నా­రు. ఈ నెల 28 వరకు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే ఉంటుందని, ఆ తర్వాత వానలు పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. 

గణనీయంగా ఉష్ణోగ్రతలు 
రాష్ట్రంలో ఎండాకాలంలో నమోదయ్యే స్థాయిలో ఇప్పు­డు ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. బుధ­వా­రం అత్యధికంగా నల్లగొండలో 36.5 డిగ్రీల సెల్సి­యస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. సెపె్టంబర్‌ మూ­డో వా­రంలో సాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల మేర.. కనిష్ట ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల మేర ఉం­డాలని..కానీ ఇప్పుడు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయని అధికారులు చెప్తున్నారు. రెండు మూడు రోజు­ల తర్వాత ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి చేరవచ్చని అంటున్నారు. 

మరిన్ని వార్తలు