ముచ్చటగా మూడు పెళ్లిళ్లు..విడాకులు ఇవ్వకుండా మరో పెళ్లికి సిద్ధం

30 Jan, 2023 08:42 IST|Sakshi

సాక్షి, కంటోన్మెంట్‌: ముచ్చటగా మూడు పెళ్లిళ్లు చేసుకుని నాలుగో పెళ్లికి సిద్ధమైన నిత్య పెళ్లి కొడుకు బాగోతం బోయిన్‌పల్లిలో కలకలం సృష్టించింది. బోయిన్‌పల్లి పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. వంశీ కృష్ణ (39) అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ దిల్‌కుష్‌ నగర్‌లోని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇతను గతంలోనే రెండు పెళ్లిళ్లు చేసుకుని వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకున్నాడు. తాజాగా మూడో పెళ్లి కోసం ఓ మ్యాట్రిమోనీని సంప్రదించాడు. నెల్లూరు జిల్లాకు చెందిన డాక్టర్‌ మీనారెడ్డికి ఏడాది క్రితమే వివాహం జరగ్గా ఇటీవలే భర్త చనిపోయాడు.

ఈమె కూడా అదే మ్యాట్రిమోనీలో దరఖాస్తు చేసుకుంది. మ్యాట్రిమోనీ ద్వారా ఒకరి వివరాలు మరొకరికి అందడంతో, గత నెలలోనే వంశీకృష్ణ నెల్లూరుకు వెళ్లి మీనారెడ్డినికి కలిశాడు. నాలుగైదు రోజుల పాటు అక్కడే ఉండి నగరానికి తిరిగొచ్చాడు. ఈ నెల 4వ తేదీన నగరానికి వచ్చిన మీనారెడ్డిని కుటుంబ సభ్యుల సమక్షంలోనే ఆడంబరం లేకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల అనంతరం నెల్లూరుకు వెళ్లికిన మీనా రెడ్డి ఈ నెల 24న మళ్లీ తిరిగొచ్చి వంశీకృష్ణ ఇంటికి చేరుకుంది. అయితే అప్పటికే వంశీకృష్ణ తనకు మీనారెడ్డితో వివాహ బంధాన్ని కొనసాగించడం ఇష్టం లేదంటూ చెప్పి, ఓ గదిలో బంధించాడు.

మళ్లీ వివాహం కోసం మ్యాట్రిమోనీని సంప్రదించాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న వంశీకృష్ణ మళ్లీ పెళ్లికోసం దరఖాస్తు చేసుకోవడంతో మ్యాట్రీమోనీ నిర్వాహకులు మీనారెడ్డిని ఫోన్‌లో సంప్రదించారు. ఆమె చెప్పిన వివరాలతో పాటు వంశీకృష్ణపై ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. దీంతో ఆమె వంశీకృష్ణ చెరనుంచి తప్పించుకుని బోయిన్‌పల్లి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వంశీకృష్ణను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వంశీకృష్ణ మూడు పెళ్లిళ్ల వ్యవహారంలో అతని కుటుంబ సభ్యులు పాత్రపై కూడా ఆరాతీస్తున్నారు.  

(చదవండి: పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. పట్టుబడ్డ డిప్యూటీ మేయర్‌)

మరిన్ని వార్తలు