హైదరాబాద్‌: ఫాంహౌస్‌పై పోలీసుల దాడి.. 10 మంది విదేశీయులు అరెస్ట్‌ 

12 Jun, 2022 13:31 IST|Sakshi
 పట్టుబడిన మద్యం, విదేశీయులు, నగర యువకులు  

సాక్షి, రంగారెడ్డి: ఓ ఫాంహౌస్‌పై శుక్రవారం అర్ధరాత్రి ఎస్‌ఓటీ పోలీసులు మెరుపు దాడి చేశారు. పది మంది విదేశీయులు, నలుగురు నగరవాసులను అరెస్టు చేశారు. ఈ సంఘటన మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. శంషాబాద్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి శనివారం వివరాలు వెల్లడించారు. టాంజానియా దేశానికి చెందిన కీషబ్‌ డేవిడ్‌   హైదరాబాద్‌కు వచ్చి టోలిచౌకిలో నివాసం ఉంటోంది. ‘కూల్‌ బైదీ కూల్‌’ పేరుతో పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆన్‌లైన్‌లో ఓ యాడ్‌ అప్‌లోడ్‌ చేసింది. రూ.1000 ఎంట్రీ ఫీజు చెల్లిస్తే బీరు ఫ్రీ అంటూ యాడ్‌లో పేర్కొంది.

ఇందుకుగాను మొయినాబాద్‌ మండలం, శ్రీరాంనగర్‌ రెవెన్యూలో ఉన్న న్యూ గ్రీన్‌ ఫాంహౌస్‌ను అద్దెకు తీసుకుంది. పారీ్టకి వెళ్లేందుకు సూడాన్‌ దేశానికి చెందిన మహ్మద్‌ మూసా ఉమర్, అబ్దుల్‌ బాసిత్‌ హమీద్‌ అలీ, అబ్దుల్‌ కరీంవాడి ఇస్మాయిల్, కెన్యాకు చెందిన ఖతీబ్, కాంగో దేశానికి చెందిన కింపలో మయిండో, చాంద్‌ దేశానికి చెందిన అబకాకా, కేమరూన్‌ దేశానికి చెందిన గంజి, టాంజానియా దేశానికి చెందిన సౌము మహ్మది, బత్రోమేవ్‌ విట్‌నెస్‌ విల్లి, హైదరాబాద్‌కు చెందిన వాసింఖాన్, సయ్యద్‌ ఇర్ఫాన్, సయ్యద్‌ అమీద్, అనుగుల వంశీ  బుక్‌ చేసుకున్నారు. శుక్రవారం రాత్రి  ఫాంహౌస్‌కు చేరుకున్నారు. 

పార్టీ జరుగుతుండగా శనివారం తెల్లవారు జామున శంషాబాద్‌ జోన్‌ ఎస్‌ఓటీ పోలీసులు, స్థానిక పోలీసులతో కలిసి ఫాంహౌస్‌పై మెరుపుదాడి చేశా రు. నిర్వాహకురాలితో పాటు పది మంది విదేశీయు లు, నలుగురు నగర యువకులను, ఫాంహౌస్‌ నిర్వాహకుడు నిహల్‌ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. 120 బీరు బాటిళ్లు, నాలుగు ఓడ్కా బాటిళ్లు, ఐదు రకాల హుక్కా ఫ్లేవర్స్, సెల్‌ ఫోన్లు, స్విఫ్ట్‌ కారును స్వాదీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో రాజేంద్రనగర్‌ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్‌ ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మీరెడ్డి, ఎస్‌ఓటీ పోలీసులు పాల్గొన్నారు.
చదవండి:  ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష ఆత్మహత్య కేసులో సంచలన విషయాలు

మరిన్ని వార్తలు