సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

17 Feb, 2023 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అయితే ఈ ప్రాజెక్టులో పర్యావరణ అనుమతులు ఉన్న 7.15 టీఎంసీల వరకు మాత్రమే పనులు కొనసాగించుకునేందుకు సుప్రీంకోర్టు అనుమతిచ్చింది. అలాగే తాగునీటి అవసరాలకు మాత్రమే నీటిని వినియోగించు కోవాలని స్పష్టం చేసింది.

ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొకుండా.. ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం వెల్లడించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం పేర్కొంది.

అదే విధంగా ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని గతంలో జాతీయ హరిత ట్రిబ్యునల్‌(ఎన్జీటీ) విధించిన రూ. 500కోట్ల జరిమానాపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఈ కేసుకు సంబంధించి ప్రతివాదులందరికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ. తదుపరి విచారణను ఆగష్టుకు వాయిదా వేసింది.

కాగా  పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ జాతీయ హరిత ట్రిబ్యునల్‌  తెలంగాణ ప్రభుత్వానికి రూ. 528  కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ  తీర్పును వ్యతిరేకిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం ధర్మాసనం విచారణ జరిపింది. 
చదవండి: సుప్రీంకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. ఈనెల 27కు విచారణ వాయిదా

మరిన్ని వార్తలు