ఫిట్‌మెంట్‌ 7.5%.. అంత తక్కువైతే.. మాకొద్దు

28 Jan, 2021 02:06 IST|Sakshi

పీఆర్‌సీ నివేదికపై మండిపడ్డ ఉద్యోగ సంఘాలు

బీఆర్‌కేఆర్‌ భవన్‌ ఎదుట ‘ఐక్యవేదిక’ ఆధ్వర్యంలో నిరసన

త్రిసభ్య కమిటీతో కొన్ని ఉద్యోగ సంఘాల నేతల చర్చలు

నేడు మరికొన్ని సంఘాలతో భేటీ.. ఆపై సర్కార్‌కు నివేదిక

58 నుంచి 60 ఏళ్లకు పదవీ విరమణ వయో పరిమితి పెంపు

2018, జూలై 1 నుంచి వేతన సవరణ అమలు

కనీస వేతనం రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంపు

పీఆర్‌సీ సిఫారసుల నివేదికను బహిర్గతం చేసిన ప్రభుత్వం

గరిష్ట వేతనం రూ.1.10 లక్షల నుంచి రూ.1.62 లక్షలకు పెంపు

హెచ్‌ఆర్‌ఏ రేట్లలో కోతలు.. డీఏ రేటు పెంపు

చైల్డ్‌ కేర్‌ లీవ్‌ 90 నుంచి 120 రోజులకు పెంపు

మూలవేతనంపై 1% వసూలు చేసి క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ 

సీపీఎస్‌లో ప్రభుత్వ వాటా 10 నుంచి 14 శాతానికి పెంపు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వారి మూలవేతనంపై 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ అమలు చేయాలని వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) సిఫారసు చేసింది. 2018 జూలై 1 నుంచి వేతన సవరణ అమలు చేయాలని సూచించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పొడిగించాలంటూ మరో కీలక సిఫారసు కూడా చేసింది. ఈ మేరకు చిత్తరంజన్‌ బిస్వాల్‌ నేతృత్వంలోని తెలంగాణ తొలి పీఆర్‌సీ గత డిసెంబర్‌ 31న సమర్పించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం బహిర్గతం చేసింది. 

ఫిట్‌మెంట్‌ 7.5 శాతం ఎలా అంటే..?
ఉద్యోగుల కనీస వేతనాన్ని నెలకు రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలని కమిషన్‌ తొలుత నిర్ణయం తీసుకుంది. దీని ప్రాతిపదికగా ఫిట్‌మెంట్‌ శాతాన్ని ఖరారు చేసింది. అదెలాగంటే.. ప్రస్తుత కనీస వేతనం రూ.13,825కు 2018 జూలై 1 నాటికి ఉన్న 33.399 శాతం డీఏ కలిపిన తర్వాత 7.5 శాతం ఫిట్‌మెంట్‌ జోడిస్తే (రూ.13,825+33.399% డీఏ+7.5% ఫిట్‌మెంట్‌) కనీస వేతనం రూ.19 వేలకు పెరుగుతుంది. అందుకే 7.5 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ జరపాలని సిఫారసు చేస్తున్నట్టు కమిషన్‌ వివరణ ఇచ్చింది. కమిషన్‌ చేసిన ఇతర సిఫారసులు ఇలా ఉన్నాయి.

మాస్టర్‌ పే విధానం యథాతథం
కనీస వేతనాన్ని నెలకు రూ.రూ.13,825 నుంచి రూ.19 వేలకు పెంచాలి. గరిష్ట వేతనాన్ని రూ.1,10,850 నుంచి రూ.1,62,070కు పెంచాలి. కనీస, గరిష్ట వేతనాల మధ్య నిష్పత్తి 1:8.53గా ఉండనుంది. 32 గ్రేడ్లు, 80 సెగ్మెంట్లతో మాస్టర్‌ పే విధానం యథాతథంగా కొనసాగనుంది. వార్షిక ఇంక్రిమెంట్‌ రేంజ్‌ ప్రారంభ దశలో 3.36 శాతం నుంచి తుదకు 2.33 శాతం వరకు ఉండాలి. కేంద్ర ప్రభుత్వాన్ని అనుసరించి ఏటా రెండు పర్యాయాలు డీఏను మంజూరు చేసే విధానాన్ని కొనసాగించాలి. 2018 జూలై 1 నాటికి ఉన్న డీఏను కనీస వేతనంలో కలిపేస్తున్న నేపథ్యంలో 2019 జనవరి 1 నుంచి డీఏను 0.910 కన్వర్షన్‌ ఫ్యాక్టర్‌ ఆధారంగా మంజూరు చేయాలి. ఈ లెక్కన 2019 జనవరి 1 నుంచి కేంద్ర ప్రభుత్వం 1 శాతం డీఏ పెంచితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 0.910 శాతం పెరుగుతుంది. గత పీఆర్సీ సిఫారసు చేసిన డీఏ కన్వర్షన్‌ ఫ్యాక్టర్‌ 0.524 % మాత్రమే. 


బుధవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌ ముందు ఆందోళన చేస్తున్న ఉద్యోగ సంఘాలు

హెచ్‌ఆర్‌ఏ రేటులో కోత వేసినా..
7వ కేంద్ర వేతనాల కమిషన్‌ (సీపీసీ) హెచ్‌ఆర్‌ఏ శ్లాబు రేట్లను 30 శాతం, 20 శాతం, 10 శాతం నుంచి వరుసగా 24 శాతం, 16 శాతం, 8 శాతానికి తగ్గిస్తూ సిఫారసులు చేసిన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హెచ్‌ఆర్‌ఏ శ్లాబ్‌ రేట్లను సైతం తగ్గించాలి. వారి మూల వేతనంపై 30, 20, 14.5, 12 శాతాల నుంచి వరుసగా 24, 17, 13, 11 శాతాలకు తగ్గించాలి. కనీస వేతనం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.18 వేల మాత్రమే ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.19 వేలు సిఫారసు చేస్తున్నాం. ఈ నేపథ్యంలో హెచ్‌ఆర్‌ఏ ఖరారు చేసే అంశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పోల్చితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్పంగా లబ్ధి చేకూరుతుంది. దీనికి తోడు మూలవేతనానికి డీఏను కలపడంతో పాటు 7.5 శాతం ఫిట్‌మెంట్‌ను జత చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం పొందుతున్న దాని కన్నా అధికంగా హెచ్‌ఆర్‌ఏ పొందుతారు. మూల వేతనంతో పోల్చితే కరువు భత్యం 50 శాతానికి మించిన సందర్భాల్లో హెచ్‌ఆర్‌ఏ శ్లాబు రేట్లను వరుసగా 27, 18.5, 14, 11.5 శాతాలకు పెంచాలి.

హెచ్‌ఆర్‌ఏ చెల్లింపులకు నగరాల వర్గీకరణ
2011 జనాభా లెక్కలు, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మున్సిపల్‌ ప్రాంతాల ఆధారంగా హెచ్‌ఆర్‌ఏ చెల్లింపులకు సంబంధించిన నగరాల వర్గీకరణను పీఆర్సీ నవీకరించింది. వివరాలు.. 
– 50 లక్షలు ఆపై జనాభా కలిగిన జీహెచ్‌ఎంసీ పరిధిలో మూల వేతనంపై హెచ్‌ఆర్‌ఏను 30 శాతం నుంచి 24 శాతానికి తగ్గించాలి. 
– 2 లక్షలకు పైగా జనాభా కలిగిన కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్‌ నగరాల్లో 20 శాతం నుంచి 17 శాతానికి తగ్గించాలి. 
– 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలతో పాటు 50 వేలకు లోపల జనాభా కలిగిన జిల్లా కేంద్రాల్లో 14.5 శాతం నుంచి 13 శాతానికి తగ్గించాలి. 
– ఇతర ప్రాంతాల్లో 12 శాతం నుంచి 11 శాతానికి తగ్గించాలి.

ఒంటరి తండ్రులకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌ వర్తింపు
సాధారణ పిల్లల విషయంలో చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను 90 రోజుల నుంచి 120 రోజులకు పెంచాలి. దివ్యాంగ పిల్లలు కలిగి ఉంటేనే చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను 90 రోజుల నుంచి రెండేళ్లకు పెంచాలి. తొలి 365 రోజుల పాటు 100 శాతం జీతంతో, మిగిలిన 365 రోజులు 80 శాతం వేతనంతో ఈ సెలవులు ఇవ్వాలి. అవివాహిత, విడాకులు పొందిన, భార్య మరణించిన పురుష ఉద్యోగులకు చైల్డ్‌ కేర్‌ లీవ్‌ను వర్తింపజేయాలి. ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలి. ప్రస్తుతం వీరికి వేతనం లేని 120 రోజుల ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. 

క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఇలా..
ఉద్యోగులు, పెన్షనర్ల మూలవేతనం, మూల పెన్షన్‌ నుంచి 1 శాతాన్ని మినహాయించుకుని ‘ఆరోగ్య భద్రత’ఖాతాలో నిల్వ ఉంచడం ద్వారా ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీం (ఈహెచ్‌ఎస్‌) కింద క్యాష్‌లెస్‌ వైద్య సదుపాయం కల్పించాలి. తొలుత వైద్య ఖర్చులను ఈ ఖాతా నుంచి చెల్లించాలి. బిల్లులను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ ద్వారా తిరిగి ఈ ఖాతాలో డబ్బులు జమ చేయాలి. పదవీ విరమణ సమయంలో ఒక నెల పెన్షన్‌కు సమానమైన డబ్బులను లేదా ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులను ఏకమొత్తంగా తీసుకున్న సీపీఎస్‌ ఉద్యోగులకు సైతం ఈహెచ్‌ఎస్‌ వర్తింపజేయాలి. సర్వీసు పెన్షనర్లు, ఫ్యామిలీ పెన్షనర్ల వైద్య భత్యాన్ని నెలకు రూ.350 నుంచి రూ.600కు పెంచాలి. 

పరిమితులు లేకుండా ఎల్టీసీ
ప్రస్తుత లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్‌ (ఎల్టీసీ) పథకానికి బదులు దేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు వీలుగా కొత్త పథకాన్ని అమలు చేయాలి. నాలుగు ఏళ్లకు ఒకసారి చొప్పున మొత్తం సర్వీసు కాలంలో గరిష్టంగా 4 పర్యాయాలు ఎల్టీసీ సదుపాయాన్ని కల్పించాలి. దూరం, డబ్బుల విషయంలో పరిమితులు లేకుండా ఈ పథకాన్ని అమలు చేయాలి. 

సర్కారీ బడుల్లో చదివిస్తేనే ఫీజులు
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల పిల్లల చదువులకు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున గరిష్టంగా ఇద్దరు పిల్లల ఫీజులను ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చదివించే ఉద్యోగుల పిల్లల ఫీజులను ఏడాదికి రూ.2 వేలు చొప్పున ఇద్దరు పిల్లలకు చెల్లించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది.

అంత్యక్రియల వ్యయం రూ.30 వేలు
ఉద్యోగుల అంత్యక్రియల వ్యయాన్ని రూ.30 వేలకు పెంచాలి. షెడ్యూల్డ్‌ ఏరియాల్లో పనిచేసే ఉద్యోగులకు స్పెషల్‌ కాంపెన్సేటరీ అలవెన్స్‌లను నెలకు 30 శాతం వరకు గరిష్టంగా రూ.1,660కు మించకుండా పెంచాలి. అంధ ఉపాధ్యాయులు, లెక్చరర్లకు చెల్లించే రీడర్స్‌ అలవెన్సును గరిష్టంగా రూ.2,500కు మించకుండా 30 శాతానికి పెంచాలి. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పని చేసే ఉద్యోగులకు మూల వేతనంపై 20 శాతం వరకు ఢిల్లీ అలవెన్సు/ప్రత్యేక అలవెన్సును రూ.5,500 కు మించకుండా పెంచాలి. అంధ, బధిర, శారీరక వికలాంగ ఉద్యోగుల కన్వేయన్స్‌ అలవెన్సును రూ.3 వేలకు మించకుండా మూత వేతనంపై 10 శాతానికి పెంచాలి. 

సీపీఎస్‌లో సర్కారు వాటా పెంపు
కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి తగ్గట్టు కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం(సీపీఎస్‌)లో రాష్ట్ర ప్రభుత్వ వాటాను మూలవేతనం+డీఏపై 10 శాతం నుంచి 14 శాతానికి పెంచాలి. సీపీఎస్‌ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఇన్‌వాలిడేషన్‌ పెన్షన్‌/ఫ్యామిలీ పెన్షన్‌ సదుపాయాన్ని కల్పించాలి. పాత పెన్షన్‌ పథకం పెన్షనర్లు/ఫ్యామిలీ పెన్షనర్లకు సమానంగా సీపీఎస్‌ పెన్షనర్లకు సైతం డెత్‌ రిలీఫ్‌ చార్జీలను వర్తింపజేయాలి.  

మరిన్ని వార్తలు