తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీ.. ఆమ్రపాలికి ఆ బాధ్యతలు

14 Dec, 2023 19:34 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ జరిగింది. పదోన్నతుల బదిలీలుగా పేర్కొంటూ పలువురిని తన పేషీలో చేర్చుకుంది ప్రభుత్వం. ఊహించినట్లుగానే యువ ఐఏఎస్‌ అధికారిణి ఆమ్రపాలికి బాధ్యతలు దక్కాయి. హెచ్‌ఎండీఏ జాయింట్‌ కమిషనర్‌గా ఆమెను నియమించింది. 

డిప్యూటీ సీఎం ఓఎస్‌డీ(ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా కృష్ణభాస్కర్‌, వ్యవసాయ కార్యదర్శిగా బి.గోపి, TSSPDCL (దక్షిణ) చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా ముషారఫ్‌ అలీ ఫరూకీని, ట్రాన్స్ కో జేఎండీ (జాయింట్ మ్యానేజింగ్ డైరెక్టర్)గా సందీప్ కుమార్, TSNPDCL(ఉత్తర) వరంగల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా కర్నాటి వరుణ్ రెడ్డి, ఎంపీడీసీఎల్‌కు సీఎండీగా క్రాంతి వరుణ్‌రెడ్డి, వైద్య..ఆరోగ్య శాఖ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ కమిషనర్‌గా శైలజా రామయ్యర్‌ను నియమించారు. విద్యుత్‌ డిపార్ట్‌మెంట్‌లోనే ఈ బదిలీలు ఎక్కువగా జరిగాయి.

ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శిగా సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీని నియమిస్తూ.. ట్రాన్స్‌కో చైర్మన్‌ అండ్‌ ఎండీగా అదనపు బాధ్యతలూ అప్పజెప్పారు.  ఇటీవలె డీ. ప్రభాకర్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి అభినందించాక.. ఆమ్రపాలికి ఏదో ఒక బాధ్యతలు అప్పజెప్తారనే ప్రచారం విపరీతంగా జరిగింది. అందుకు తగ్గట్లే ఆమెకు హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బాధ్యతల్ని అప్పజెప్పారు.

>
మరిన్ని వార్తలు