దివ్యాంగులకు ప్రభుత్వం పూర్తి భరోసా

4 Dec, 2021 01:45 IST|Sakshi
సావనీర్‌ను ఆవిష్కరిస్తున్న మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, మహమూద్‌ అలీ, కె.ఈశ్వర్, తలసాని, మల్లారెడ్డి 

దివ్యాంగుల దినోత్సవాల్లో మంత్రి కొప్పుల 

గన్‌ఫౌండ్రీ: రాష్ట్రప్రభుత్వం దివ్యాంగులకు పూర్తి భరోసా ఇస్తుందని సాంఘిక సంక్షేమ శాఖమంత్రి కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం రవీంద్రభారతిలో వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా అత్యధిక పెన్షన్లను దివ్యాంగులకు అందజేస్తున్నట్లు చెప్పారు. అలాగే పలు సంక్షేమ పథకాలు, క్రీడారంగం, పలు విభాగాల్లో దివ్యాంగులకు ప్రత్యేక కోటా ఏర్పాటు చేశామని వివరించారు.

రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వికలాంగులకు రూ.18 కోట్లతో ఏటా పెన్షన్లను అందిస్తున్నట్లు తెలిపారు. స్త్రీ, శిశు సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమ శాఖను వేరు చేయాలనే ప్రతిపాదనను మంత్రిమండలికి సిఫారసు చేస్తానని కొప్పుల హామీ ఇచ్చారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ వికలాంగులకు అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి దివ్య దేవరాజ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు