తెలంగాణ అబ్బాయి బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లితో ఒక్కటయ్యారు

22 Aug, 2022 11:02 IST|Sakshi

నిజామాబాద్ జిల్లా: వేల్పూర్‌ మండల కేంద్రానికి చెందిన గుమ్మల హరీష్‌కు, బంగ్లాదేశ్‌కు చెందిన రోషి (రోషిణి) అనే అమ్మాయితో ఆదివారం వెంకటాపూర్‌ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయంలో వివాహం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. గుమ్మల హరీష్‌ ఐదేళ్ల క్రితం ఉపాధికోసం జోర్డాన్‌ దేశానికి వెళ్లాడు. అక్కడికే ఉపాధికోసం బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన రిషి అనే అమ్మాయితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇరువురు ఇష్టపడి నాలుగేళ్ల కింద జోర్డాన్‌లోనే పెళ్లి చేసుకున్నారు.

 రెండేళ్ల కింద హరీష్‌ ఇంటికి వచ్చాడు. కోవిడ్‌ వల్ల తిరిగి జోర్డాన్‌ వెళ్లలేకపోయాడు. పాస్‌పోర్డు రెన్యూవల్‌ ఉండడం, కోవిడ్‌ పరిస్థితుల వల్ల అమ్మాయి కూడా వేల్పూర్‌కు రాలేకపోయింది. ప్రస్తుతం పరిస్థితులు అనుకూలించడంతో నెలరోజుల కింద రోషి వేల్పూర్‌లోని హరీష్‌ వద్దకు చేరింది. దీంతో తమ సమక్షంలో పెళ్లి జరిపాలని హరీష్‌ తల్లిదండ్రులు గుమ్మల యాదగిరి, కమల, బంధువులు నిర్ణయించారు. ఆదివారం మంచి ముహూర్తం ఉండడంతో మండలంలోని వెంకటాపూర్‌ వేంకటేశ్వర ఆలయంలో వేదమంత్రాల సాక్షిగా కుటుంబీకులు, బంధుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు