కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ హ్యాక్‌ 

26 Aug, 2020 01:11 IST|Sakshi

పాకిస్తాన్‌కి చెందిన దుండగులు చేసినట్లు గుర్తింపు 

హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు

సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యక్తిగత వెబ్‌సైట్‌ను పాకిస్తాన్‌కు చెందిన దుండగులు హ్యాక్‌ చేశారు. కేంద్ర మంత్రి కాకముందు ఈ వెబ్‌సైట్‌ను తన స్థానిక ఈవెంట్ల కవరేజీ కోసం ఆయన వినియోగించేవారు. కేంద్ర మంత్రి అయ్యాక ఈ వెబ్‌సైట్‌ను అంతగా వినియోగించడం లేదు. ఆగస్టు 15న ఈ వెబ్‌సైట్‌ హ్యాక్‌ అవగా.. ఆలస్యంగా గుర్తించినట్టు తెలుస్తోంది. వెబ్‌సైట్‌ హ్యాక్‌ అయినట్టుగా కిషన్‌రెడ్డి కార్యాలయం హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై సైబర్‌క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వెబ్‌సైట్‌ను హ్యాక్‌ చేసిన పాకిస్తాన్‌ దుండగులు అందులో భారతదేశంపై దూషణలు చేశారు. ‘హ్యాపీ ఇండిపెండెన్స్‌ డే పాకిస్తాన్‌.. హ్యాక్డ్‌ బై మిస్టర్‌ హెచ్‌ఏకే.. పాకిస్తాన్‌ జిందాబాద్‌’అని శీర్షికగా రాశారు. ‘మా కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు సెల్యూట్‌..’అంటూ భారతదేశాన్ని దూషించారు. ‘కశ్మీర్‌ను విముక్తి చేయండి.. మేం యుద్ధానికి సిద్ధం.. ఫిబ్రవరి 27 గుర్తుంచుకోండి..’ అంటూ  రాశారు.   

మరిన్ని వార్తలు