Warangal: పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో అస్వస్థతకు గురైన అభ్యర్ధి మృతి

20 Dec, 2022 09:06 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షల్లో అస్వస్థతకు గురైన అభ్యర్థి బాణోత్‌ రాజేందర్‌ మృతి చెందారు. వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో అతడి మృతదేహాన్ని స్వగ్రామం ములుగు జిల్లా పందికుంట శివారు శివతాండకు తరలించారు.

కాగా, శనివారం 1600 మీటర్ల పరుగు పందెంలో రాజేందర్‌ కుప్పకూలిపోయాడు. వెంటనే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందించారు. రెండుసార్లు కార్డియాక్ అరెస్ట్ కావడంతో వైద్యులు రాజేందర్‌ను ఆర్ఎస్ఐసీయూ వార్డుకి తరలించి.. వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో సోమవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందారు.

మృతుడికి భార్య సుజాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఉద్యోగం సాధించి కుటుంబానికి ఆసరాగా ఉంటాడనుకుంటే రన్నింగ్‌లో అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

చదవండి: (భర్త ఇంటికి లేటుగా వచ్చాడని.. బాత్‌రూమ్‌లోకి వెళ్లి యాసిడ్‌..)

మరిన్ని వార్తలు