తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఏడో రోజు ఆదివారం ఉదయం స్వామివారు శంఖు, చక్రాలు, విల్లు, బాణం, గధ, ఖడ్గం, పంచాయుధాలను ధరించి సూర్యప్రభ వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులకు హారతులు సమర్పించారు. అనంతరం స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. రాత్రి స్వామి వారి చంద్రప్రభ వాహన సేవ వైభవంగా సాగింది. పెద్ద జీయర్స్వామి, చిన్న జీయర్ స్వామి, డిప్యూటీ ఈఓ నాగరత్నం, ఏఈఓ మోహన్, సూపరింటెండెంట్ రమేష్, కంకణభట్టర్ ఆనందకుమార్ దీక్షితులు, టెంపుల్ ఇన్స్పెక్టర్లు సురేష్, చలపతి పాల్గొన్నారు.
బంగారు గొడుగు ఉత్సవం
సోమవారం నిర్వహించనున్న స్వామి వారి రథోత్సవాన్ని పురస్కరించుకొని బంగారు గొడుగు ధర్మకర్త పంతులుగారి వంశానికి చెందిన పంతులుగారి రామనాథన్ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం బంగారు గొడుగు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బంగారు గొడుగుకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చారు.