అన్యమత ప్రచారంపై ప్రభుత్వం సీరియస్‌

23 Aug, 2019 13:45 IST|Sakshi

విచారణకు ఆదేశం

సాక్షి, అమరావతి: తిరుమలలో బస్‌ టికెట్లపై అన్యమత ప్రచార ఘటనపై ప్రభుత్వం సీరియస్‌ అయింది. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు టిమ్‌ రోల్స్‌ సరఫరా చేసిన అధికారులు, కాంట్రాక్టర్లుపై రవాణా శాఖ విచారణ చేపట్టింది. టీడీపీ హయాంలోని కాంట్రాక్టర్లే బస్‌ టికెట్ల టిమ్‌ రోల్స్‌ పంపిణీ చేసినట్లుగా అధికారులు నిర్ధారించారు. నెల్లూరు డిపో నుంచి తిరుమలకు టిమ్‌ రోల్స్‌ను కాంట్రాక్టర్‌ సరఫరా చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ వివరణ
ఆర్టీసీ ద్వారా అన్యమత యాత్రా ప్రచారం జరగలేదని తిరుమల ఆర్టీసీ డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి తెలిపారు. ఆర్టీసీ టికెట్ల వెనుక ముద్రించి ఉన్నవి గత టీడీపీ ప్రభుత్వ పథకాల వివరాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని డిపోలలోని ఆర్టీసీ టికెట్ల వెనుక ఇవి ముద్రించి ఉన్నాయని, అలా గత ప్రభుత్వ పథకాలతో ముద్రించిన కొన్ని రోల్స్ తిరుమల డిపోకు వచ్చాయని వివరించారు. గత ప్రభుత్వ పథకాల గురించి ముద్రించి ఉన్న టికెట్లను వెనక్కు పంపించి వేశామని తెలిపారు. 

మరిన్ని వార్తలు