జల్సాల కోసం దొంగలుగా మారిన ముగ్గురు యువకులు
ధర్మవరం అర్బన్ : జల్సాలకు అలవాటుపడిన దొంగలుగా మారిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం ధర్మవరం పట్టణ పోలీస్స్టేషన్లో ఇన్చార్జ్ డీఎస్పీ రామవర్మ, సీఐ హరినాథ్ వివరాలను మీడియాకు వెల్లడించారు. కేశవనగర్కు చెందిన గిరక నరేష్, శివానగర్కు చెందిన చింతాకుల రాజ్కుమార్, కేశవనగర్కు చెందిన షేక్ నూర్ మహమ్మద్ జల్సాలకు అలవాటుపడ్డారు. ఇందుకు అవసరమైన డబ్బులు సమకూర్చుకునేందుకు దొంగలుగా మారారు. ముఠాగా ఏర్పడిన వీరు యరగుంట వద్దనున్న హెచ్పీ గ్యాస్ కార్యాలయంలో నగదు దొంగతనం చేశారు. అనంతరం గాంధీనగర్లో ఒక మహిళ మెడలో బంగారు గొలుసు, లక్ష్మీచెన్నకేశవపురంలో మహిళ మెడలో బంగారు గొలుసు, కొత్తపేట, కేశవనగర్, శివానగర్లలో ఇళ్లలో అమర్చిన నీళ్ల మోటార్లతోపాటు సాయినగర్లోని ఒక ఇంట్లో చోరీ చేశారు. ఇప్పటికే పట్టుచీరల దొంగతనం కేసులో నరేష్, రాజ్కుమార్ జైలుకు వెళ్లి వచ్చారని డీఎస్పీ తెలిపారు.
ఈ ముగ్గురూ బుధవారం బంగారు గొలుసులు, నీళ్ల మోటార్లను తీసుకుని బెంగళూరుకు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్కెట్యార్డు వద్ద పట్టణ సీఐ హరినాథ్, ఎస్ఐలు జయానాయక్, శ్రీహర్ష, హెడ్కానిస్టేబుల్ డోనాసింగ్, మునేనాయక్, కానిస్టేబుళ్లు ప్రసాద్, భాస్కర్నాయుడు, షాకీర్, నాగరాజు, శ్రీనివాసులు, నాగార్జున, మంజునాథ్, హోంగార్డు నరసింహులు దొంగలను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి రెండు బంగారు గొలుసులు, రెండు వెండి కుంకుమ భరిణిలు, 8 నీళ్ల మోటార్లు మొత్తం రూ.1,90,530 విలువగల వస్తువులను రికవరీ చేశామని డీఎస్పీ తెలిపారు.