న్యూఢిల్లీ : సీడబ్ల్యూసీ సమావేశం పార్లమెంట్ సమావేశాలకు ముందు ఉండొచ్చని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. అధిష్టానం ఆదేశంతో హస్తిన చేరుకున్న ఆయన విలేకర్లు అడిగిన ప్రశ్నకు తనకేమి తెలియదని కూడా చెప్పారు. కాంగ్రెస్ వార్ రూమ్లో పార్టీ అగ్రనేతలు దిగ్విజయ్ సింగ్, గులాంనబీ ఆజాద్తో భేటీ తర్వాత బయటకు వచ్చిన బొత్స .... ఒకింత చిరాకుగా కనిపించారు.
మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తే చాలా సేపటి తర్వాత మాట్లాడారు. తమ పార్టీ విధానం త్వరలోనే చెప్తుందని... అన్నారు. త్వరలోనే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని అన్నారు. నిర్ణయం చెప్పేందుకే ఈ సమావేశాలు అని ఆయన పేర్కొన్నారు.
అంతకు ముందు వార్ రూమ్ లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో దిగ్విజయ్ సింగ్, గులాం నబీ ఆజాద్ భేటీ అయ్యారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో భేటీ జరుగుతోంది. కాగా కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు జరగనుంది.