విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంపై ధర్నా

10 Feb, 2014 02:42 IST|Sakshi

ఖమ్మం సిటీ, న్యూస్‌లైన్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే వరంగల్ జిల్లా డోర్నకల్‌కు చెందిన  షేక్ హుస్సేన్ మృతి చెందాడని ఆరోపిస్తూ అతని కుటుంబ సభ్యులు, మైనార్టీ సంఘం నాయకులు ఆదివారం జిల్లా ఆస్పత్రిలోధర్నా నిర్వహించారు. డోర్నకల్‌కు చెందిన షేక్ హుస్సేన్ ఖమ్మం నగరంలో వాటర్ సర్వీసింగ్ సెంటర్‌లో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.

 శనివారం రాత్రి అతను జూబ్లీక్లబ్ సమీపంలోని నెహ్రూచౌక్ ప్రాంతంలో మూత్ర విసర్జనకు వెళ్లగా కిందకు వేళాడుతున్న ట్రాన్స్‌ఫార్మర్ వైర్లు తగిలి విద్యుదాఘాతంతో మృతి చెందిన విష యం విదితమే. మృతుడు నిరుపేద కుటుంబానికి చెందిన వాడని, అతనిపై తల్లి, ఇద్దరు చెల్లెళ్లు ఆధారపడి జీవిస్తున్నారని, అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ముస్లిం నాయకులు రెండు గంటల పాటు ఆస్పత్రిలో ధర్నా నిర్వహించారు. దీంతో ఖమ్మం త్రీటౌన్ సీఐ రెహమాన్ విద్యుత్‌శాఖ డీఈ ధన్‌సింగ్‌ను ఆస్పత్రికి పిలిపించి ముస్లిం పెద్దలతో చర్చిం చారు. రూ. 10లక్షలు ఎక్స్‌గ్రేషియా, మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ముస్లిం పెద్దలు డిమాండ్ చేశారు.

 చివరకు విద్యుత్‌శాఖ  తరఫున రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌తో మాట్లాడి మృతుడి తల్లికి ఏదైనా పార్కులో స్వీపర్ పోస్టు ఇప్పించేలా ఒప్పందం కుదిర్చారు. నెల రోజుల్లో ఈ రెండు హామీలు నెరవేర్చాలని మృతుడి కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో డీఈ ఒప్పుకున్నారు. అనంతరం హుస్సేన్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. త్రీటౌన్ సీఐ రెహమాన్, టూటౌన్, త్రీటౌన్ పోలీస్‌సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకురాలు సకీనా, సీపీఐ నాయకుడు మహ్మద్‌సలాం, మైనార్టీ నాయకులు హకీం, సలీం పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు