తెలంగాణ ఉద్యమంలో ఒక్క విగ్రహాన్ని కూడా ధ్వంసం చేయలేదని, ఇప్పుడిక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని దేవుడు కూడా అడ్డుకోలేడని టీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కె.కేశవరావు అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ఆరు నెలలు అవసరం లేదని.. కేంద్రానికి, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సరిగ్గా రెండు నెలల్లో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేయొచ్చని ఆయన చెప్పారు.
ఇందులో జాప్యం చేస్తే అనవసర అపోహలు వస్తాయని, 2009లోనే ఈ అంశంపై చర్చ జరిగిందని అన్నారు. సీమాంధ్రుల రాజీ నామాలు అనైతికం అనిపిస్తోందని, సీమాంధ్రుల ఉద్యమం కృత్రిమమైనదని కేకే వ్యాఖ్యానించారు. ఇక తెలంగాణ - ఆంధ్ర ప్రాంతాలు కలిసి ఉండటం సాధ్యమయ్యే పని కాదని, అందువల్ల అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టద్దని సూచించారు. సీమాంధ్రులు అనవసరంగా తెలంగాణ ప్రాంతీయులను రెచ్చగొట్టడం సరికాదని కేకే వ్యాఖ్యానించారు.