ఉసూరుమంటున్న ఉపాధి రంగం

24 Oct, 2013 00:49 IST|Sakshi
ఉసూరుమంటున్న ఉపాధి రంగం
జనాభా పెరుగుదల, వారిలో పట్టభద్రుల సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఉపాధి కల్పన అంతంత మాత్రమే. ఏ ఒక్క రాజకీయ నేత గానీ, పార్టీ గానీ ఈ అంశం  గురించి ఆలోచిస్తోందా?
 
 పంచవర్ష ప్రణాళికలతో దేశ సమగ్రాభివృద్ధి కార్యక్రమాన్ని 1951లో చేపట్టారు. 11 పంచ వర్ష ప్రణాళికలు పూర్తయ్యి, 12వ ప్రణాళిక అమలులో ఉంది. ఉత్పత్తులకు, సేవలకు, పరిశ్రమలకు, ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్ప నకు లక్ష్యాలు నిర్ణయించారు. కానీ, జనాభా పరిమితికి నిర్ణయించలేదు. కుటుంబ నియం త్రణను ప్రోత్సహించాలన్న ఆకాంక్ష ఉన్నా ఏ పధకం ద్వారా దానిని అమలుపరచాలి, పెరుగుదలను ఏ పరిమితలో ఉంచాలి అనే దానిపై స్పష్టత లేదు. 
 
 ప్రతి దశకంలో జనాభా 0 నుంచి 17 కోట్లు పెరుగుతోంది. 2013లో మన జనాభా 123 కోట్లు. సంవత్సరానికి 1.5 శాతం పెరు గుతోంది. అంటే ప్రతియేటా 1,84,50,000 మంది పెరుగుతున్నారు. 2021 నాటికి మన జనాభా 140 కోట్లు కావచ్చు. అంటే చైనాను మించిపోతాం.
 
 వీరందరికీ ఉపాధి కల్పించగలమా? 10, 11 పంచవర్ష ప్రణాళికల లక్ష్యం- ప్రతి ఏటా అదనంగా ఒక కోటి మందికి ఉపాధి కల్పించాలి. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) సాలీనా 8 నుంచి 9 శాతం పెరిగిన ఏ సంవ త్సరంలోనూ కోటి మందికి అదనపు ఉపాధు లను కల్పించలేకపోయాం. అత్యధికంగా ఎన్డీఏ హయాంలో, ఒక ఏడాదిలో 80 లక్షల మందికి ఉపాధి లభించింది. గత ఐదేళ్లలో సాలీనా నికర అదనపు ఉపాధి కల్పన ఐదు లక్షలకు మించలేదు. జనాభా పెరుగుదల 170/180 లక్షలు. 
 
 ఉపాధి పెరుగుదల 5 లక్ష లు. ఈ విధంగా కోట్ల సంఖ్యలో ఉపాధి రహితులు తయారైతే పర్యవసానం ఏమిటి?
 గతంలో చాలా మంది విద్య, నైపుణ్యం లేని వారే. ఇటీవల తరాల వారు బీటెక్, ఎం సీఏ, ఎంబీఏ, ఎంకాం, ఎంఏ, బీఈడీ, బీఏ, సీఏ వగైరా పట్టాలు తీసుకుంటున్నారు. ఇటు వంటి వారికి ఉపాధి అవకాశాలు లేకపోతే, వారు ఏ దారి పడతారు? కిలో బియ్యం, ఎన్‌ఆర్‌ఈజీఏ, ఇందిరమ్మ గృహాలు, అమ్మ హస్తం, విద్యాహక్కు, ఆహారభద్రత చట్టాలు, రీ-యింబర్స్‌మెంట్ పథకాలు వీరిని భవిష్య త్తులో తృప్తిపరచగలవా?
 
 ప్రస్తుతం ఒక్క మన రాష్ట్రంలోనే 10 లక్ష ల మంది బీటెక్ ఇంజనీర్లు నిరుద్యోగులుగా ఉన్నారు. దేశంలో ఏడాదికి, 3,600 ఇంజనీ రింగ్ కళాశాలల్లో, 13 లక్షల మంది యువతీ యువకులు చేరుతున్నారు. వీరిలో 10 లక్షల మంది మాత్రమే పట్టా పొందుతున్నారు. కానీ వీరంతా ఉద్యోగార్హులు కారని ప్రతి సర్వే చెబు తోంది. అంటే విద్యా ప్రమాణాలు ఘోరంగా దిగజారిపోయాయి. ఏటా 3 లక్షలకు పైగా ఐటీ/ఐటీఈఎస్ రంగంలో ఉద్యోగాలు లభిం చేవి. అవి ఈ సంవత్సరం 1,80,000కు కుదిం చుకుపోయాయి. ఇతర రంగాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది.
 
 జనాభాతో పాటు, వారిలో పట్టభద్రుల సంఖ్య పెరిగిపోతోంది. కానీ ఉపాధి కల్పన అంతంతమాత్రమే. ఏ ఒక్క రాజకీయ నేతను గాని, పార్టీని గాని ఈ అంశం ఆలోచింప చేస్తోందా? నేతల ఘోషలన్నీ సంక్షేమం, అన్నీ ఉచితంగా తినిపిస్తామనడం, అన్నిటికీ హక్కులు ఇచ్చే చట్టాలు చేస్తామనడానికి పరిమితమవుతోంది. కోట్ల మంది విద్యావం తులైన యువ జనాభాను పెంచుతున్నాం. దీని పర్యవసానాలు దారుణంగా ఉన్నాయి. విద్యావంతులైన నేరగాళ్లు పెరుగుతున్నారు. అందరూ సంపదను పంచి పెడతామనే వారే గాని, శ్రమ ద్వారా, పొదుపు ద్వారా, జనాభా నియంత్రణ ద్వారా, శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం ద్వారా, ప్రకృతి ప్రసాదించిన వన రులను ఉపయోగించుకుని, బృహత్ పధకాల అమలు ద్వారా ఉపాధి కల్పిస్తూ, సంపదను సృష్టిస్తూ, పేదరికాన్ని నిర్మూలన చేద్దామనే ఆలోచన నాయకులు లేదు.
 
 దేశంలోని నదులన్నింటినీ అనుసంధా నించి, జలాశయాలు కట్టి అన్ని రాష్ట్రాలకు, జాతీయ కాలువల ద్వారా రాష్ట్ర జలాశయా లను నింపడం, 75 వేల కిలోమీటర్ల విశాల రాష్ట్రీయ రహదార్ల నిర్మాణం, మరో 25 వేల కిలోమీటర్ల రైల్వేలను దేశ సరిహద్దుల వరకు విస్తరిచడం, వచ్చే 25 సంవత్సరాల్లో గ్రామాల నుంచి పనికోసం పట్నాలకు వచ్చే 70 కోట్ల ప్రజల కోసం 6,000 కొత్త పట్టణాలను నిర్మించడం, 7,500 కిలోమీటర్ల సముద్ర తీరంలో మరో 200 నౌకాశ్రయాలను, 33 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యమున్న భారతావనిలో కనీసం మరో 300 విమానాశ్ర యాలను కట్టడం, ప్రస్తుతమున్న 36,000 కళాశాలను లక్ష వరకు పెంచడం, దేశంలో 650 జిల్లా కేంద్రాల్లో అధునాతన బహుశా ఖీయ వైద్యశాలల స్థాపనను ప్రోత్సహించి, సహభాగస్వామ్యంలో నిర్వహించడం వంటి బృహత్ కార్యక్రమాలను చేపడితే పెరుగుతు న్న జనాభాను సంపదను సృష్టించే వారిగా తయారు చేయవచ్చు. 
 
 ప్రస్తుతం ఈ దేశాన్ని పాలించే వారిలో సుపరిపాలన, స్వజాతీయ పరిపాలనా దృష్టి క్షీణిస్తోంది. ఈ పరిస్థితుల్లో లోక్‌సభకు రాబో యే ఎన్నికలు, ధర్మాధర్మాల మధ్య, దేశీయ విదేశీయతల మధ్య, శ్రమ-సోమరితనం మధ్య, సంపద సృష్టి- సంపద క్షయం మధ్య జరిగే కురుక్షేత్ర సంగ్రామం అవుతుందని భావించడం వాస్తవ దూరం కాదు.
  త్రిపురనేని హనుమాన్ చౌదరి
మరిన్ని వార్తలు