ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య

11 Jul, 2015 04:09 IST|Sakshi

ఎమ్మిగనూరురూరల్ :  మానసిక ఒత్తిడికి లోనైనా ఓ ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎమ్మిగనూరులో చోటు చేసుకుంది. బంధువుల వివరాల మేరకు .. ఎమ్మిగనూరు గాంధీనగర్‌కు చెందిన గోవిందు, ఉమా దంపతులు తమ కుమారుడు ఈశ్వర్(23)ను గత ఏడాది ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజనీరింగ్ కాలేజిలో చేర్పించారు. అయితే చదువు విషయంలో మానసికంగా ఒత్తిడికి గురై ఇబ్బంది పడుతుండడంతో కాలేజీ మాన్పించారు. మానసిక స్థితి సరిగా లేనట్లు గుర్తించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి మానసిక వైద్యుల వద్ద చూపించారు. పరిస్థితి కొద్దిగా కుదుట పడడంతో ఈ ఏడాది కాలేజీలో చేర్పించారు.

గురువారం కాలేజికి వెళ్లిన ఈశ్వర్  ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో కాలేజీ సిబ్బంది బైక్‌పై తెచ్చి ఇంటి వద్ద వదిలివెళ్లారు. ఇంట్లో బ్యాగ్ పెట్టి బయటకు వెళ్లిన ఈశ్వర్ రాత్రి పొద్దుపోయినా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పట్టణమంతా గాలించినా ఫలితం లేకపోయింది. శుక్రవారం ఉదయం లక్ష్మణ్ థియేటర్ వెనక భాగంలోని బావిలో శవంగా కనిపించాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శంకరయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు