సముద్రంలో పాము కరిచి మత్స్యకారుడి మృతి

14 Jul, 2016 20:15 IST|Sakshi

సంతబొమ్మాళి (శ్రీకాకుళం) : చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడు సముద్రంలో పాము కాటు వేయడంతో మృతి చెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడులో గురువారం చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన మత్స్యకారుడు తెప్పల కామయ్య(60) ఉదయం ఆరు గంటలకు భావనపాడు జట్టీ నుంచి బోటులో బై.రామ్మూర్తి, దున్న అప్పన్న, సత్యంతో పాటు మరో నలుగురుతో కలిసి బోటుపై సముద్రంలో చేపలు వేటకు వెళ్లారు.

వలలో భారీగా చేపలు పడడంతో ఆనందపడిన మత్స్యకారులు వాటిని బోటులోకి లాగే ప్రయత్నం చేశారు. అయితే వలలోని చేపలు తీస్తుండగా... అందులో చిక్కుకున్న సముద్ర పాము కామయ్యను కాటు వేయడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆయన వెంట ఉన్నవారు ఒడ్డుకు తీసుకొచ్చేలోగానే చనిపోయాడు. నౌపడ ఏఎస్సై రామారావు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి.. కామయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం టెక్కలి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు