ఈదురుగాలులకు ఎగిరిపోయిన సచివాలయం రేకులు

7 May, 2019 16:13 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నాం వాతావరణం ఒక్కసారిగా మారింది. ఉదయం వరకూ ప్రశాంతంగా ఉన్న రాజధాని ప్రాంతం.. ఒక్కసారిగా ఈదురు గాలులు వీచడంతో చిగురుటాకులా వణికింది. గాలి, భారీవర్షం అమరావతి పరిసర ప్రాంతంలో బీభత్సం సృష్టించాయి. గాలల ధాటికి రాష్ట్ర సచివాలయంలో రేకులు ఎగిరిపడ్డాయి. సచివాలయ ప్రాంగణంలో స్మార్ట్‌పోల్‌, ఎంట్రీపాయింట్‌ కుప్పకూలాయి. బ్లాక్‌ టెర్రస్‌లో రేకులు ఎగిరిపడగా, నాలుగో బ్లాక్‌లో రేకులు ఈదురుగాలల ధాటికి  విరిగిపోయాయి. అలాగే గుంటూరు, తాడికొండ ప్రాంతాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళగిరిలో వడగాళ్ల వాన స్థానికులను అతలాకుతలం చేసింది. 

మీడియాకు అనుమతి నిరాకరణ
మరోవైపు ఇటీవల నిర్మించిన తాత్కాలిక హైకోర్టు భవనం కూడా దెబ్బతిన్నది. ఈదురు గాలులకు హైకోర్టు రేకులు ఊడిపోయాయి.  అదే సమయంలో సమీపంలో ఉన్న రమణ అనే కార్మికురాలపై రేకులు పడి తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆమెను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. రేకులు లేచిపోవడంతో అక్కడి సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన భవనాన్ని రిపేర్‌ చేశారు. హైకోర్టు ప్రాంగణంలోకి మీడియాను అనుమంతించకుండా భారీగా పోలీసుల్ని మోహరించారు. 


 

మరిన్ని వార్తలు