నేను తెలుగమ్మాయినే..

9 Jul, 2014 01:48 IST|Sakshi
నేను తెలుగమ్మాయినే..

కొవ్వూరు రూరల్: ‘అచ్చ తెలుగు అమ్మాయిని.. ఎంబీఏ చదువుతుండగా మోడలింగ్‌లో అవకాశమొచ్చింది..’ అని అంటున్నారు బందిపోటు చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈషా. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ హైదరాబాదీ అమ్మాయి కొవ్వూరు మండలం కుమారదేవంలో సందడి చేశారు. బందిపోటు చిత్ర షూటింగ్‌లో భాగంగా ఇక్కడకు వచ్చిన ఈషా విలేకరులతో ముచ్చటించారు.  

 సినీ పరిశ్రమకు ఎలా పరిచయమయ్యారు
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ప్రోత్సాహంతో సినీ పరిశ్రమకు వచ్చాను. స్వతహాగా నాకు మోడలింగ్ అంటే ఇష్టం. చదువుకుంటూనే అంబికా దర్బార్‌బత్తి, అపర్ణ కనస్ట్రక్షన్స్, చెన్నై జ్యూయలరీస్ వంటి యాడ్స్‌లో నటించాను.

తొలిసారిగా నటించినప్పుడు మీకు ఎలా అనిపించింది
‘అంతకుముందు ఆ తరువాత’ సినిమాలో కెమెరా ముందుకు వచ్చినప్పుడు చాలా భయం వేసింది. అయితే దర్శకుడు మోహనకృష్ణ, కో-ఆర్టిస్ట్ సుమం త్ అశ్విన్ ప్రోత్సాహంతో భయం పోయింది.

 ఏ సినిమాల్లో నటిస్తున్నారు
బందిపోటుతో పాటు కేరింత లో హీరోయిన్‌గా నటిస్తున్నా.

 ఏ పాత్రలంటే ఇష్టం
యాక్షన్, సెంటిమెంట్‌తోపాటు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. పాత హీరోయిన్లంతా నాకు రోల్ మోడల్సే. శ్రీదేవి అంటే చాలా ఇష్టం.

 మీ కుటుంబ నేపథ్యం
నాన్న శంకర్‌లాల్ బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగి. అమ్మ నాగేశ్వరి గృహిణి. అక్క, చెల్లి ఉన్నారు.

 గోదావరి ప్రాంతం మీకెలా ఉంది
ఇక్కడి పరిసర ప్రాంతాలు, వాటి అందాలు, ఆహ్లాదకర వాతావరణం కట్టిపడేస్తున్నాయి. అమ్మ నాగేశ్వరి స్వగ్రామం రాజ మండ్రి కావడంతో తరచూ వస్తుండేదాన్ని. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడ్డాం.
 

>
మరిన్ని వార్తలు