అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుందాం

14 May, 2016 02:43 IST|Sakshi
అక్రమ ప్రాజెక్టులను అడ్డుకుందాం

ఎగువ ప్రాజెక్టుల నిర్మాణంతో కృష్ణా, గోదావరి డెల్టా మనుగడ ప్రశ్నార్థకం
వివిధ రైతు సంఘాల నాయకుల ఆందోళన

 
విజయవాడ(గాంధీనగర్): కృష్ణా గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ నిర్మాణాలు అడ్డుకునేందుకు రైతు సంఘాలతో అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వం ఢిల్లీ తీసుకెళ్లాలని రౌండ్‌టేబుల్ సమావేశ తీర్మానించింది. అక్రమ ప్రాజెక్టులను ఆడ్డుకోకపోతే కృష్ణా, గోదావరి డెల్టా మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు- వివాదాలు ’ అనే అంశంపై శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పీ రామచంద్రయ్య అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోవాలన్నారు. అందుకోసం ప్రభుత్వం మేధావులు, రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించి కార్యచరణ ప్రకటించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేసుకోకపోతే సాగునీటి సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో ఏపీ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, వీ ఆజాద్, చలసాని ఆంజనేయులు, కొమ్మన నాగేశ్వరరావు. యలమందరావు  పాల్గొన్నారు.


నదులు అనుసంధానం చేయాలి: వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ మంత్రి
రాష్ట్రంలో నదుల అనుసంధానం ప్రక్రియను వేగవంతం చేయాలి. సాగు, తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో వ్యవహరించాలి. వర్షాకాలంలో నీరు సముద్రం పాలు కాకుండా ప్రకాశం బ్యారేజీకి దిగువన పులిగడ్డ వరకు చెక్‌డ్యామ్‌లు నిర్మించాలి. పులిచింతల ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేసి, నిర్దేశిత నీటిని నిల్వ చేయాలి.  

స్వయం ప్రతిపత్తి కలిగిన అథారిటీ ఉండాలి: ఎంవీఎస్ నాగిరెడ్డి,  వైఎస్సార్ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు
ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పులు అమలు చేయకపోతే తీవ్రంగా నష్టపోతాం. నీటి పంపకాల విషయంలో సమగ్ర జల విధానం కావాలి. ఎగువ రాష్ట్రాలు అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తే భవిష్యత్ ప్రమాదకరంగా మారుతుంది, డెల్టా మనుగడ దెబ్బతింటుంది. నీటి పంపకాల కోసం స్వయం ప్రతిపత్తి కలిగిన అథారిటినీ ఏర్పాటు చేయాలి.


అందరినీ కలుపుకోవడం లేదు: జలగం కుమారస్వామి, బీకేఎస్, జాతీయ కార్యవర్గ సభ్యుడు
సీఎం చంద్రబాబుకు అందరినీ కలుపుకుని పోవాలనే ఆలోచనే లేదు. తాను మాత్రమే చేయాలి. తన ప్రభుత్వమే చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. అక్రమంగా పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించారు కాబట్టే ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని తెలంగాణ రాష్ట్రం వాదిస్తుంటే మన రాష్ట్రం వాటిని అడ్డుకునే ధైర్యం చేయడం లేదు. రెండేళ్ల పాలనలో ఏ విషయంలోనూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. రాయలసీమకు తాగు నీరు లేని పరిస్థితి ఏర్పడింది. గోదావరి డెల్టాలో ఏడాదికే తీవ్ర సంక్షోభం వచ్చింది.

 
 నీటి వాడకంపై కేంద్ర నియంత్రణ ఉండాలి : నరసింహారావు, రైతు సంఘం నాయకుడు

 నీళ్లు రాజకీయమయ్యాయి. దిగువ రాష్ట్రాలు నీళ్లు వాడుకునే హక్కు కోల్పోయాయి. దీనికి రాష్ర్ట ప్రభుత్వమే కారణం. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఇతరులను నిందించేకంటే ..పులిచింతల ప్రాజెక్ట్‌ను సత్వరమే పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి. ప్రాజెక్ట్ పరిధిలోని 6 గ్రామాలకు నేటికీ ఆర్ ఆర్‌ప్యాకేజీ’ ఇవ్వ లేదు. ప్రాజెక్టులో 45 టీఎంసీలకుగాను కేవలం 14 టీఎంసీలే నిల్వ ఉంటుంది. నదుల్లో నీటి వినియోగంపై కేంద్రం నియంత్రణ ఉండాలి.

 సీఎం కార్యాలయానికే వెళ్లలేని పరిస్థితి : యేర్నేని నాగేంద్రనాథ్, రైతాంగ సమాఖ్య నాయకుడు
 ప్రధాని వద్దకైనా వెళ్లగలంగానీ, రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసే పరిస్థితి లేదు. ఇరిగేషన్ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసుకుని రైతులను కలవనివ్వడం లేదు. సమస్యలు చెబుదామని వెళితే పోలీసులు అడ్డుకుంటున్నారు. సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తోంది. పట్టిసీమ నీళ్లు రాయలసీమకు ఎలా తీసుకెళతారో.. మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

మరిన్ని వార్తలు