ఎగువ సభకు ముగ్గురే ముగ్గురు

28 Mar, 2019 10:45 IST|Sakshi
వి.వి.గిరి

సాక్షి, అరసవల్లి: జిల్లా రాజకీయ ముఖ చరిత్రలో రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వంటి పదవులు అలంకరించిన స్థాయి వ్యక్తులు ఉన్నారు. అయితే లోక్‌సభకు, రాజ్యసభకు కూడా ఎందరో ముఖ్య నేతలు ఎన్నికయ్యారు. ఎంపికయ్యారు. అయితే ఇందులో ఎగువ సభ (రాజ్యసభ)కు మాత్రం ఇప్పటివరకు ముగ్గురంటే ముగ్గురే ఎంపికయ్యారు. పూర్తి కాలం పదవుల్లో పనిచేశారు. ఇందులో ముందుగా పాలవలస రాజశేఖరం జిల్లా నుంచి తొలి రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారు. తర్వాత మజ్జి తులసీదాస్, కళా వెంకటరావులు కూడా రాజ్యసభ ఎంపీలుగా జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహించారు. 


కేంద్ర మంత్రులుగా నలుగురే...
జిల్లా నుంచి కేంద్ర మంత్రులుగా ఇంతవరకు నలుగురే పనిచేశారు. ముందుగా పాతపట్నం ఎంపీగా ఉన్న వి. వి.గిరి కేంద్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత కె.ఎర్రం నాయుడు, గత యూపీఏలో కేంద్ర మంత్రివర్గంలో కిల్లి కృపారాణి, కిషోర్‌ చంద్రదేవ్‌లు మంత్రులుగా పనిచేశారు.


రాష్ట్ర మంత్రులుగా
జిల్లా నుంచి చాలామంది నేతలు రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రులుగా పనిచేశారు. గౌతు లచ్చన్న, గొర్లె శ్రీరాముల నాయుడు, మజ్జి తులసీదాస్, వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు, లుకలాపు లక్ష్మణదాస్, తంగి సత్యన్నారాయణ, చిగిలిపల్లి శ్యామలరావులు మంత్రులుగా ఓ వెలుగు వెలిగారు. తర్వాత తరంలో ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, కిమిడి కళావెంకటరావు, కావలి ప్రతిభాభారతి, గౌతు శివాజీ, గుండ అప్పలసూర్యనారాయణ, కోండ్రు ముర ళీ మోహన్, కె.అచ్చెన్నాయుడు తదితరులు మంత్రులుగా పనిచేశారు. అలాగే జిల్లా ఆర్‌ఎల్‌ఎన్‌.దొర, తంగి సత్యనారాయణ, కావలి ప్రతిభాభారతిలు స్పీకర్లుగా పనిచేశారు.  

మరిన్ని వార్తలు