తమిళనాడు, కోస్తాంధ్రాకు భారీ వర్ష సూచన

26 Apr, 2019 19:43 IST|Sakshi

సాక్షి, చెన్నై/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతానికి అనుకొని వాయుగుండం కొనసాగుతుంది. చెన్నై తీరానికి 1440 కి.మీ దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం వాయువ్య దిశగా ప్రయాణిస్తుంది. ఈ వాయుగుండం శనివారం తుపాన్‌గా మారనుందని చెన్నై ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ తుపాన్‌కు ‘ఫణి’  పేరును ఖరారు చేయనున్నారు. ఈ నెల 30వ తేదీ సాయంత్రం ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా మధ్య తుపాన్‌ తీరం దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. తుపాన్‌ ప్రభావంతో తీరం వెంబడి 45 నుంచి 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్‌ తీరం దాటే సమయంలో మాత్రం గంటకు 90 నుంచి 115 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. 

తుపాన్‌ కారణంగా తమిళనాడు, కోస్తాంధ్రాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. ఏప్రిల్‌ 30, మే 1 తేదీల్లో ఆయా తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతోపాటు.. అలలు సాధారణం కంటే ఎక్కువగా ఎగసి పడే అకాశం ఉంది. ఈ నేపథ్యంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లు తక్షణమే తీరానికి చేరుకోవాలని అధికారులు హెచ్చరించారు. 

చదవండి: 
‘ఫణి’ దూసుకొస్తోంది

వాయుగుండంగా మారిన తీవ్ర అల్పపీడనం
 

మరిన్ని వార్తలు