మడకశిర: అనంతపురం జిల్లాలో రోడ్డు నిబంధనలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. మడకశిర సీఐ శుభకుమార్ కూడా ర్యాలీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. సోమవారం ఆయన ఓ కేసు విచారణ నిమిత్తం మడకశిర నుంచి అమరాపురం మండలంలోని వి.అగ్రహారానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నలుగురిని కూర్చోబెట్టుకుని మడకశిరకు వస్తున్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన సీఐ వెంటనే వాహనాన్ని ఆపి ఆ వ్యక్తికి కౌన్సెలింగ్ ఇచ్చారు. మీకు చేతులెత్తి నమస్కరిస్తా.. ఇలా చేయొద్దు.. అని వేడుకున్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మరోవైపు వాహనదారుల భద్రత కోసం ఏపీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించింది. హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు, సీట్ బెల్టులు పెట్టుకోని కారు డ్రైవర్లకు ఇంధనాన్ని సరఫరా చేయరాదంటూ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నిబంధనలు పాటించని వారికి పెట్రోల్, డీజిల్ పోయరాదని పెట్రోల్ బంకుల యాజమన్యాలను సూచించింది.