అవినీతి టీడీపీ పాలనకు చరమగీతం పాడాలి

18 Nov, 2018 08:20 IST|Sakshi

వైఎస్సార్‌ సీపీ నేత పిల్లి సుభాష్‌చంద్రబోస్‌

జెడ్పీ ప్రతిపక్ష నేతసాకా ప్రసన్నకుమార్‌ పాదయాత్ర ప్రారంభం 

రావులపాలెం (కొత్తపేట): అడుగడుగునా అవినీతికి పాల్పడుతున్న టీడీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరపడ్డాయని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ అన్నారు. జెడ్పీ ప్రతిపక్ష నేత సాకా ప్రసన్నకుమార్‌ తన జన్మదినం సందర్భంగా రావులపాలెం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా గౌరీపట్నానికి శనివారం పాదయాత్ర ప్రారంభించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ విజయం సాధించి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని, కొత్తపేటలో ఎమ్మెల్యేగా తిరిగి చిర్ల జగ్గిరెడ్డి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ, హత్యాయత్నం నుంచి జగన్‌ క్షేమంగా బయటపడి తిరిగి ప్రజల మధ్యకు రావడంపై సంతోషం వ్యక్తం చేస్తూ చేపట్టిన ఈ పాదయాత్రను.. రావులపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద బోస్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. తొలుత ప్రసన్నకుమార్‌తో జన్మదిన కేకు కట్‌ చేయించారు. స్థానిక సెంటర్‌లోని డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి, చిర్ల సోమసుందరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం బోస్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభు త్వ నిధులతో జరుగుతున్న పోలవరం ప్రాజెక్టులో అడుగడుగునా అవినీతి తాండవిస్తోందన్నారు. దీనిపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఆధారాలు వెల్లడించారన్నారు. ఈ అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకోవచ్చని, కేంద్రమే సుప్రీం అని, అవినీతిని నిరోధించే చర్యలను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవడం సమంజసం కాదని అన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని వైఎస్సార్‌ సీపీ డిమాండ్‌ చేస్తోందన్నారు. ప్రతిపక్ష నేత జగన్‌పై జరిగిన హత్యాయత్నాన్ని కూడా రాజకీయం చేయడం చూసి ప్రజలు చంద్రబాబును అసహ్యించుకుంటున్నారన్నారు. శత్రువైనా కష్టాల్లో ఉన్నప్పుడు పలకరించడం తెలుగు సంప్రదాయమన్నారు. హత్యాయత్నం ఘటనను ఖండించి దర్యాప్తు చేయిస్తున్నామని చెప్పి ఉంటే చంద్రబాబు గౌరవం పెరిగేదని బోస్‌ అన్నారు.

ఎమ్మెల్యే జగ్గిరెడ్డి మాట్లాడుతూ స్థానిక ప్రజాప్రతినిధులను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన చంద్రబాబు పాలన త్వరలోనే అంతమవుతుందన్నారు. ప్రసన్నకుమార్‌ పాదయాత్ర విజ యవంతం కావాలని ఆకాంక్షించారు. అనంతరం ఊబలంక మీదుగా ప్రసన్నకుమార్‌ పాదయాత్ర ఆత్రేయపురం మండలం వైపు సాగింది. మార్గం మధ్యలో పలుచోట్ల అభిమానులు పార్టీ శ్రేణులు ఆయనకు స్వాగతం పలికి, జన్మదిన కేకులు కట్‌ చేయించారు. తీన్‌మార్‌ డప్పులు, బాణసంచా కాల్పులతో పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రసన్నకుమార్‌తోపాటు బోస్, జగ్గిరెడ్డి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పీకే రావు, మాజీ కార్యదర్శి కర్రి పాపారాయుడు, అమలాపురం పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మునికుమారి ఊబలంక వరకూ పాదయాత్ర చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, సంయుక్త కార్యదర్శి గొల్లపల్లి డేవిడ్‌రాజు, ఎంపీపీ కోట చెల్లయ్య, జిల్లా సేవాదళ్‌ కన్వీనర్‌ మార్గన గంగాధరరావు, అడ్లగళ్ళ సాయిరామ్, జిల్లా కార్యదర్శి గొలుగూరి మునిరెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకులు చల్లా ప్రభాకరరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యులు బొక్కా వెంకటలక్ష్మి, అప్పారి విజయ్‌కుమార్, మండల కన్వీనర్లు దొమ్మేటి అర్జునరావు, తమ్మన శ్రీను, కనుమూరి శ్రీనివాసరాజు, ముత్యాల వీరభద్రరావు, ఎంపీటీసీ సభ్యులు కొండేపూడి రామకృష్ణ, బొక్కా ప్రసాద్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మల్లిడి రామిరెడ్డి, కోనాల రాజు, చంటి కోపెల్లమిల్లి, ద్వారంపూడి సుధాకరరెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు