‘సమయం వచ్చినప్పుడు గుణపాఠం తప్పదు’

16 Mar, 2017 11:53 IST|Sakshi

అమరావతి: ఏపీ శాసనసభలో కీలక అంశాలపై చర్చ జరగనీయకుండా చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పోలవరం, చేనేత, పేదల ఇళ్లపై చర్చ జరగకుండా సభను వాయిదా వేసిందని విమర్శించారు. మూడేళ్ల పాలన పేదలకు ఒక్క ఇల్లు కట్టిన పాపాన పోలేదని మండిపడ్డారు.

‘హైదరాబాద్ లో చంద్రబాబు ఆడంబరంగా ఇల్లు కట్టుకుంటున్నారు. నారా లోకేశ్‌ కు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. పేదవారికి ఇల్లు కట్టాలనే ఆలోచన రాకపోవడం దారుణం. వీళ్లు చేసే అన్యాయాలు ప్రజలు చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు తగిన గుణపాఠం చెబుతార’ని రామకృష్ణా రెడ్డి అన్నారు.