పోలవరంపై సీడబ్య్యూసీని కలిసిన అధికారులు..

13 Mar, 2018 20:52 IST|Sakshi

డీపీఆర్‌పై వివరణ ఇచ్చామని వెల్లడి

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, పోలవరం ఛీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వర్లు కేంద్ర జలవనరుల శాఖ అధికారులను సోమవారం కలిశారు. పోలవరం రివైజ్డ్‌ డీపీఆర్‌(డీటేల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌)ను గత ఆగస్టులో కేంద్రానికి అందజేసినట్టు తెలిపారు. డీపీఆర్‌పై సీడబ్య్యూసీ (సెంట్రల్‌ వాటర్‌ కమీషన్‌)కి ఉన్న అభ్యంతరాలపై వివరణ ఇచ్చామని వారు చెప్పారు.

సీడబ్య్యూసీలో పోలవరం డీపీఆర్‌ పరిశీలన చివరి దశలో ఉన్నట్లు వివరించారు. రివైజ్డ్‌ డీపీఆర్‌లో డ్యాం నిర్మాణం, హెడ్‌ వర్క్స్‌, కుడి కాలువ, ఎడమ కాలువ, భూ సేకరణ, నష్ట పరిహారం, పునరావాసం తదితర అంశాలన్నీ పొందుపరిచామని వెల్లడించారు. కేంద్రం కంటే ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వం పాజెక్టు నిర్మాణానికి నిధులు ఖర్చు చేసినట్టు చెప్పారు. 

కేంద్రం త్వరగా నిధులను విడుదల చేస్తే ప్రాజెక్టు నిర్మాణం వేగవంతమవుతుందని పేర్కొన్నారు. నవయుగ కాంట్రాక్టర్‌ వచ్చిన తర్వాత ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగిందని వెల్లడించారు. ‘నిధుల విషయంలో కేంద్రం సాయం మరువలేనిది. అయితే వాటి విడుదలలో జాప్యం జరుగుతోంద’ని అన్నారు. అందరి కృషితో పోలవరం 2019లో నిర్మాణం పూర్తి చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు