ముప్పుతిప్పలు పెట్టి.. పోలీసులకు చిక్కి..

4 Jan, 2015 01:20 IST|Sakshi

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు
ఆస్పత్రిలో చేర్పించిన వైనం

 
పీఎం పాలెం: విద్యార్థినిపై అఘాయిత్యానికి పాల్పడిన గ్యాంగ్‌లోని ప్రధాన నిందితుడు రవీంద్ర పోలీసులకు చిక్కాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. పీఎం పాలెం సీఐ అప్పలరాజు తెలిపిన వివరాలివి. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన రవీంద్ర మధురవాడ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. అతడి ఆగడాలు శుతిమించడంతో యాజమాన్యం కళాశాల నుంచి పంపిం చేసింది. అతడు ఆ ప్రాంతంలో ఉంటూ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని ఫొటో తీసి మార్ఫింగ్ చేసి ఆమెను బెదిరించ సాగాడు. తన రూమ్‌కు ఒంటరిగా వస్తే ఫొటోలు ఇస్తానని చెప్పాడు. అతని మాటలు నమ్మి ఆమె వెళ్లగా స్నేహితులతో కలిసి అఘాయిత్యానికి యత్నించాడు.

అక్కడి నుంచి తప్పించుకున్న బాధితురాలు పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భీమిలిలో ఉన్నట్టు సమాచారం తెలుసుకున్న పోలీసులు శక్రవారం అక్కడకు వెళ్లారు. అతడు వారి నుంచి తప్పించుకుని ఆర్కే బీచ్ ప్రాంతానికి చేరుకున్నాడు. పోలీసులకు విష యం తెలిసి గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులకు చిక్కడం ఖాయమని భావించిన నిందితుడు శుక్రవారం రాత్రి ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు అప్రమత్తమై అపస్మారక స్థితిలో ఉన్న నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.  
 
నిందితుడికి నేరచరిత్ర

 నిందితుడు రవీంద్రకు నేరచరిత్ర ఉందని సీఐ అప్పలరాజు తెలిపారు. తన స్వస్థలంలో పలు నేరాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కాడని పేర్కొన్నారు. 2013లో మధురవాడ ప్రాంతం లో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని గాయపరిచాడని తెలిపారు. ఐదేళ్లలో మూడు కళాశాలలు మారాడని, విద్యార్థులకు, కళాశాలల యాజమాన్యాలకు ఇబ్బందికరంగా మారాడని చెప్పారు.
 
వేధింపులు తాళలేకే ఆత్మహత్యాయత్నం
 
పోలీసులు విచారణ పేరుతో తమ కుమారుడ్ని హింసిస్తున్నారని తండ్రి నాగేశ్వరరావు ఆరోపించారు. వారి హింసను భరించలేకే ఆత్మహత్యాయత్నం చేశాడని విలేకరులకు తెలిపాడు. ఈ విషయమై మానవ హక్కుల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేయనున్నట్లు పేర్కొన్నాడు.
 
 

మరిన్ని వార్తలు