అలుపెరుగని బాటసారికిచివరిలో కష్టం
అక్కున చేర్చుకున్న పోలీసులు
ప్రేమ సమాజంలో అభాగ్యుడికి ఆసరా.
విజయనగరం,నెల్లిమర్ల రూరల్: సతివాడ నుంచి నెల్లిమర్ల వెళ్లే మార్గంలో ఉన్నవారికి ఆయన చిరపరిచితుడే. ఎందుకంటే ఆయన రోజూ ఆ మార్గం గుండా నడకసాగిస్తాడు. ఎంతదూరమైనా నడిచేవెళ్తాడు. ఆ నడక సాగిస్తున్నప్పుడే భోజనమయానికి ఎక్కడకు చేరుకుంటే అక్కడే చేతిలో పళ్లెంతో ఏదో ఇంటిముందు నిలిచేవాడు. వారు ఇచ్చే కొద్దిపాటి ఆహారంతోనే కడుపు నింపుకునేవాడు. ఎప్పుడూ ఎవరినీ నోరుతెరచి అడిగిన దాఖలాల్లేవు. ఇలా 40 ఏళ్లుగా ఆయన దినచర్య సాగుతోంది. ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో గడచిన కొద్ది రోజులుగా విజయనగరం కొత్తపేట శ్మశానవాటిక వద్ద తిండి తిప్పలు లేకుండా పడి ఉన్నాడు.. ఆయనే నెల్లిమర్ల మండలం గుషిణి గ్రామానికి చెందిన పతివాడ అప్పలనాయుడు. అనాథలా ఆయనలా పడి ఉన్న విష యం తెలుసుకున్న జిల్లా ఎస్పీ పాల్రాజ్ వెంటనే ఆదుకోమని నెల్లిమర్ల పోలీసులకు సూచించారు. నెల్లిమర్ల ఎస్సై నారా యణరావు తన బృందంతో వెళ్లి ఆ అభాగ్యుడిని అక్కున చేర్చుకున్నారు. స్నానం చేయించి వస్త్రాలను అందజేశారు. అనంతరం పూల్బాగ్ ప్రేమ సమాజంలో ఆసరా కల్పించారు. పోలీసుల మానవతకు అందరూ ప్రశంసలు కురిపించారు.
ఒకప్పుడు బాగా కలిగినవాడే...
అప్పలనాయుడుది ఒకప్పుడు పేరు మోసిన కు టుంబమేనని గ్రామస్తులు చెబుతుంటారు. ఊహతెలిసినప్పటి నుంచి రోజూ ఇంటి నుంచి విజయనగరం కాలినడకతో వెళ్లి వచ్చేవాడు. మొదట్లో గ్రామంలో ఉన్న ఇంటికి వచ్చినా క్రమేపి ఆ విధానాన్ని మార్చుకుని సతివాడ జంక్షన్లో రాత్రి బస చేసేవాడు. కొన్నాళ్ల తరువాత తన కొడుకు ఏమవుతాడోనని తల్లి కూడా అప్పలనాయుడు వెంటనే తిరిగేది. ఇద్దరూ కలసి అలసట లేకుండా పాదయాత్ర చేసేవారు. అనారోగ్యంతో తల్లి ఐదేళ్లక్రితమే మృతి చెందింది. ఈయనకు ఓ చెల్లి ఉందని, ఆమె రాజాంలో నివాసం ఉంటున్నట్లు అక్కడి ప్రజలు చెబుతున్నారు. తల్లి మృతి చెందడంతో అనాథలా మారాడు.