ఆ కానిస్టేబుళ్లకు, డ్రైవర్లకు రివార్డులు

15 May, 2015 15:00 IST|Sakshi
పోలీసులు స్వాధీనం చేసుకున్న కారు

ఒంగోలు: నిన్న నవజీవన్ ఎక్స్ప్రెస్లో దోపిడీ సంఘటనలో నిందితులను పట్టుకోవడంలో ధైర్యసాహసాలు ప్రదర్శించిన పోలీస్ ఉద్యోగులకు  రివార్డులు ప్రకటించారు. నిందితులను పట్టుకోవడంలో నలుగురు కానిస్టేబుళ్లు,  8 మంది జీపు డ్రైవర్లు ధైర్యసాహసాలతోపాటు ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. వారి తెలివితేటలను గుర్తించి డిఎస్పీ రివార్డులు ప్రకటించారు.

కేసు పూర్వాపరాలు... శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన బంగారు వ్యాపారులు వేమూరి రాము, సునీల్ రూ. 82 లక్షల నగదుతో కావలి రైల్వే స్టేషన్ నుంచి నవజీవన్ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు వెళ్తున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు  పోలీసులమని చెప్పి తుపాకీ చూపించి వారిని బెదిరించారు.  పడుగుపాడు స్టేషన్ సమీపంలో ఆ రైలు నెమ్మదిగా వెళుతున్న సమయంలో విచారణ పేరుతో  ఇద్దరు వ్యాపారులను కిందకు దించారు. వారిని నెల్లూరు ఆత్మకూరు బస్టాండు వద్దకు తీసుకెళ్లి,  అక్కడ నుంచి అంబాసిడర్ కారును బాడుగకు తీసుకుని, దగదర్తి మండలం దామవరం వద్దకు వెళ్లిన తరువాత వారి వద్ద ఉన్న 82 లక్షల రూపాయలను తీసుకుని వ్యాపారులను వదిలి పారిపోయారు.

బంగారు వ్యాపారుల ఫిర్యాదుపై  పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులు ప్రయాణించిన అంబాసిడర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ప్రకాశం జిల్లా కనిగిరి వద్ద ఓ కారులో వెళ్తున్న వారిని సినీఫక్కీలో వెంబడించి ముగ్గురు నిందితులను పట్టుకున్నారు.ముగ్గురిలో వెంకటసుబ్బయ్య, నాగరాజు ఒంగోలు కానిస్టేబుళ్లుగా, రవి అనే వ్యక్తి చీరాల కానిస్టేబుల్‌గా అనుమానిస్తున్నారు. పారిపోయిన వ్యక్తి స్టువర్ట్‌పురానికి చెందిన వాడిగా తెలుస్తోంది.
 

మరిన్ని వార్తలు