సెటిల్‌మెంట్లు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం

19 Aug, 2014 04:03 IST|Sakshi
సెటిల్‌మెంట్లు చేస్తే రౌడీషీట్ తెరుస్తాం

ధర్మవరం : జిల్లాలో సెటిల్‌మెంట్లు, పంచాయితీ లు ఎవరు చేసినా, అవి తన దృష్టికి వచ్చినట్లయితే అలాంటి వారిపై రౌడీషీట్ తెరుస్తామని ఎస్‌పీ రాజశేఖర్‌బాబు హెచ్చరించారు. సోమవారం ధర్మవరం పోలీస్ సబ్‌డివిజన్ పరిధిలోని సమస్యలు తెలుసుకునేందుకు స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ధర్మవరం ఏఎస్పీ అభిషేక్ మహంతితో కలసి ఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యం గా ధర్మవరంలాంటి ప్రాంతంలో బయటి వ్యక్తులు పంచాయితీలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.
 
అలాంటి వారి కదలికలపై నిఘా ఉంచుతామన్నారు. మట్కా, దొంగనోట్ల చలామణి, తదితర నేరాలపైనా గట్టి నిఘా ఉంచుతామన్నారు. ఫిర్యాదుదారులు కాళ్లరిగేలా పోలీసు స్టేషన్ల చుట్టూ తిరగకూడదని, వారికి సత్వర న్యాయం చేయాలన్న తలంపుతో ప్రజాబాట నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను నిర్దేశిత తేదీలో పు పరిష్కరిస్తామని రసీదులో నమోదు చేస్తున్నామన్నారు.
 
సంబంధిత స్టేషన్ పోలీసు అధికారి ఫిర్యాదుదారుడి సమస్యను పరిష్కరించిన తరువాత తనకూ సమాచారం అందించేలా చర్యలు చేపట్టామన్నారు. నిర్దేశిత తేదీ లోపు  పరిష్కారం కాని సమస్యలపై రివ్యూ కమిటీ వేస్తామని, ఈ కమిటీ సభ్యు లు దీర్ఘ కాల పెండింగ్ కేసులను సత్వరం పరిష్కరించే ందుకు కృషి చేస్తారని ఎస్పీ వెల్లడించారు. తొలుత తాడిపత్రి నియోజకవర్గంలో నిర్వహంచిన ప్రజాబాటలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిష్కరించామన్నారు. హిందూపురంలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కార దిశలో ఉన్నాయన్నారు.
 
ఇసుక అక్రమ రవాణాపై నిఘా
జిల్లాలోని పెన్నా, చిత్రావతి, మద్దిలేరు ప్రాంతాల నుంచి ఇసుకను అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్నట్లు గుర్తించామని ఎస్పీ అన్నారు. ఈ అక్రమ తరలింపును అడ్డుకునేందుకు ఆయా ప్రాంతాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు  చేస్తామన్నారు. కేవలం బలహీన వర్గాల వారి ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం మాత్రమే ఇసుకను.. అదీ ట్రాక్టర్ల ద్వారా మాత్రమే రవాణా చేసేలా చర్యలు చేపడతామన్నారు. అలాంటి వారు తప్పని సరిగా సంబంధిత మండల పరిధిలోనే ఇసుకను వినియోగించుకోవాలని, అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు.
 
ఈ విషయంపై మైనింగ్ శాఖ అధికారులతో ఇప్పటికే చర్చించామన్నారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోనే ప్రైవేటు సైట్లలో ఇసుకను విక్రయించే అనుమతులున్నాయని, వారు కూడా కేవలం రాష్ట్రంలో మాత్రమే విక్రయించుకోవచ్చని అన్నారు. అందులోనూ అక్రమాలు చో టుచేసుకోకుండా లైజన్ ఆఫీసర్లను నియమించి ఇసుక ఎక్కడికి రవాణా అవుతోంద న్న విషయాలపై నిఘా ఉంచుతామని చెప్పారు.
 
మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణపై చర్యలు
జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భారీ వాహనాలను ఆయా పట్టణాల్లోకి నిర్దేశించిన సమయంలో మాత్రమే వచ్చేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. ధర్మవరంలో పని చేయని నిఘా కెమెరాలను వినియోగంలోకి తెస్తామన్నారు. అనంతరం స్థానిక జర్నలిస్టులు ఎస్పీని ఘనంగా సన్మానించారు.
 
ఇసుక దందాను అడ్డుకోండి : ఎస్పీకి కేతిరెడ్డి వినతి
ధర్మవరం: నియోజకవర్గ పరిధిలోని ధర్మవరం, తాడిమర్రి, బత్తలపల్లి, ముదిగుబ్బ మండలాల్లో ఇసుక అక్ర మ రవాణా భారీ స్థాయిలో జరుగుతోందని, దీనిని అరికట్టాలని ధర్మవ రం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఎస్పీ  రాజశేఖర్‌బాబును కో రారు. సోమవారం పట్టణంలో నిర్వహించిన పోలీసు ప్రజాబాటలో ఆయ న ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో  నెలకొన్న పలు సమస్యలను ఎస్పీకి వివరించారు. అక్రమార్కులు చిత్రావతి నది నుంచి ఇసుకను డంప్‌లకు తరలిస్తున్నారని, అక్కడి నుంచి రాత్రికి రాత్రే లారీల ద్వారా బెంగళూరుకు రవాణా చేస్తున్నారని చెప్పారు.
 
దీనివల్ల భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయని, ఫలితంగా తాగునీరు సైతం లభించక పరిసర  గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరారు. ఇక ధర్మవరంలో శాంతిభద్రతల పరిరక్షణ కు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయడం లేదని, వాటిని పునరుద్ధరించాలని ఎస్పీని వినతి పత్రంలో కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు బగ్గిరి బయపరెడ్డి, శివారెడ్డి, వడ్డేబాలాజీ, కనంపల్లి భాస్కరరెడ్డి, కత్తేకొట్టా కిష్ట, పోతిరెడ్డి, పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు