మార్చికల్లా అదే రోజు సెటిల్‌మెంట్‌

9 Dec, 2023 05:36 IST|Sakshi

సెబీ చీఫ్‌ మాధవీ పురి బచ్‌

న్యూఢిల్లీ: కొత్త ఏడాది(2024)లో ఇన్వెస్టర్లు స్టాక్‌ మార్కెట్లలో లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్‌మెంట్‌ పూర్తికానుంది. స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో మార్చికల్లా అదే రోజు సెటిల్‌మెంట్‌కు తెరతీయనున్నట్లు క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్‌ మాధవీ పురి బచ్‌ తాజాగా వెల్లడించారు. వెరసి 2024 మార్చి నుంచి టీప్లస్‌జీరో సెటిల్‌మెంట్‌ను ప్రవేశపెట్టనున్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రపంచ ఆర్థిక విధానాల వేదిక 2023లో బచ్‌ పేర్కొన్నారు.

ఈ బాటలో ఇప్పటికే సెబీ స్టాక్‌ లావాదేవీల సెటిల్‌మెంట్‌ గడువులను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం లావాదేవీ చేపట్టిన మరుసటి రోజు (టీప్లస్‌1) సెటిల్‌మెంట్‌ అమలవుతోంది. దీన్ని మరో 3 నెలల్లోగా ఒకే రోజుకు పరిమితం చేయనున్నట్లు బచ్‌ చెప్పారు. కాగా.. టీప్లస్‌జీరో సెటిల్‌మెంట్‌ అమలు తదుపరి అప్పటికప్పుడు(ఇన్‌స్టేనియస్‌) సెటిల్‌మెంట్‌ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఇది ఆప్షనల్‌గా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు