బ్యాంక్ మేనేజర్‌పై రౌడీయిజం

24 May, 2016 01:50 IST|Sakshi

రుణం చెల్లించమంటే రుబాబు
పార్వతీపురం : ప్రశాంతతకు మారుపేరుగా ఉన్న పార్వతీపురం పట్టణంలో ప్రస్తుతం రౌడీయిజం ఛాయలు కనిపిస్తున్నాయి. తీసుకున్న రుణం చెల్లించమన్నందుకు స్థానిక నవిరి కాలనీలో ఉన్న కెనరా బ్యాంక్ మేనేజర్‌ను కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్, అతని అనుచరులు బెదిరించారు. దీనికి సంబంధించి బ్రాంచి మేనేజర్ జె. బాలకృష్ణ, మెయిన్ బ్రాంచి మేనేజర్ ఎ. రవికుమార్ సోమవారం రాత్రి వివరాలు వెల్లడించారు. కొత్తవలసకు చెందిన కొండూరు గణేష్ అనే వ్యక్తి పల్సర్ బైక్ కొనుగోలుకు 2015 మార్చిలో రూ.45 వేల రుణం తీసుకున్నాడు.

అప్పటి నుంచి ఇప్పటివరకు బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించలేదు సరికదా...రుణం కూడా చెల్లించలేదు. ఈ విషయమై బైక్‌కు రిజిస్ట్రేషన్ చేయించాలని బీఎం బాలకృష్ణ కోరగా, సోమవారం సాయంత్రం పూటుగా మద్యం తాగిన మరో ఐదుగురు వ్యక్తులను బ్రాంచికి తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. అతనితో వచ్చిన వ్యక్తులు ఏ ఊరు నీది...ఎక్కడుంటున్నావ్...మీ ఇంటికి భోజనానికొస్తాం... బ్యాంకు ఎప్పుడు కడతావ్... బ్యాంకు కట్టి బయటికి రా...? నీ సంగతి చూస్తామంటూ...బెదిరించారు. ఈ విషయాన్ని ఎస్సై సురేంద్రనాయుడు దృష్టికి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు