అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ: సీఎం జగన్‌

30 Dec, 2019 18:21 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఇసుక డోర్‌ డెలీవరీ దిశగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. జనవరి 2న కృష్ణా జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఇసుక డోర్‌ డెలివరీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇసుక పాలసీ, అమలు తీరుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసుక పాలసీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. జనవరి 7న ఉభయ గోదావరి, వైఎస్సార్‌ జిల్లాల్లో డోర్‌ డెలివరీ ద్వారా ఇసుక అందించాలని పేర్కొన్నారు. జనవరి 20 నాటికి అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ ప్రారంభించాలని తెలిపారు. దీనికోసం రోజుకు 2.5 లక్షల టన్నుల చొప్పున ఇసుక సిద్ధం చేయాలని ఆదేశించారు.

వచ్చే వర్షాకాలాన్ని దృష్టి పెట్టుకొని పటిష్ట ప్రణాళికలతో ముందుకెళ్లాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. వర్షాకాలంలో పనుల కోసం ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు 15 లక్షల టన్నుల ఇసుకను సిద్ధం చేయాలన్నారు. సుమారు 60 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ చేసుకోవాలని తెలిపారు. ఇసుక సరఫరాను పర్యవేక్షించడానికి చెక్‌పోస్ట్‌లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ద్వారా లైవ్‌ స్ట్రీమింగ్‌ చేయాలన్నారు. ఇసుక సరఫరా వాహనాలకు అమర్చే జీపీఎస్‌పైనా సీఎం జగన్‌ ఆరా తీశారు.

>
మరిన్ని వార్తలు