నిన్న నిశ్చితార్థం.. నేడు నామినేషన్‌..!

11 Mar, 2020 09:32 IST|Sakshi

సాక్షి, కురిచేడు: కురిచేడు ఎంపీపీ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ తరఫున ఓ యువతి బరిలోకి దిగుతోంది. అందులో ఆశ్చర్యమేముందంటారా..?...ఉంది!! మంగళవారం రాత్రి అప్పటికప్పుడు ఆ యువతికి ఓ యువకుడితో నిశ్చితార్థమైంది. కాబోయే భర్త కుటుంబం తరఫున ఆమె పోటీకి సిద్ధమైంది. తాను ఎంపీపీ పదవి రేసులో ఉంటానని ఆ యువతి ఊహించి ఉండదు. అనుకోని విధంగా వరించిన ఈ అవకాశంతో ఆ యువతి ఆనందానికి అవధుల్లేవు. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా కురిచేడు ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్‌ అయింది.

వైఎస్సార్‌ సీపీ తరఫున అభ్యర్థిని ఎంపిక చేసే బాధ్యతను దేకనకొండ గ్రామానికి చెందిన బెల్లం చంద్రశేఖర్‌కు అప్పగించారు. చంద్రశేఖర్‌కు ముగ్గురు కుమారులు కావడంతో తన భార్యను పోటీకి నిలిపే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆయన తన పెద్దకుమారుడు సురేష్‌కు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. గంగదొనకొండ గ్రామానికి చెందిన పార్శ్వపు వెంకటనర్సయ్య కుమార్తె శిరీషతో మంగళవారం రాత్రి అప్పటికప్పుడు నిశ్చితార్థం చేశారు. ఈ నెల 11వ తేదీతో ఎంపీటీసీ పదవులకు నామినేషన్‌ గడువు ముగియనుండటంతో తన కోడలిని బరిలోకి దించాలనే ఉద్దేశంతో ఈ వివాహం నిశ్చయించారు. తమ గ్రామానికి చెందిన ఎంపీటీసీ స్థానం ఇతర వర్గాలకు రిజర్వు కావడంతో కల్లూరు గ్రామ ఎంపీటీసీ అభ్యర్థిగా కాబోయే కోడలు పార్శ్వపు శిరీషతో బుధవారం నామినేషన్‌ వేయించేందుకు బెల్లం చంద్రశేఖర్‌ సిద్ధమయ్యారు.    

మరిన్ని వార్తలు