17 నుంచి శ్రీవారికి సుప్రభాతం రద్దు

13 Dec, 2017 20:31 IST|Sakshi

-నెల రోజులపాటు తిరుప్పావై పారాయణం

తిరుమల: తిరుమలలో ఈనెల 17నుంచి శ్రీవారికి సుప్రభాతం కార్యక్రమాన్ని నెల రోజులపాటు నిలిపివేయనున్నారు. ఆలయంలో పవిత్రమైన ధనుర్మాసం పూజలు ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. 2018 జనవరి 14వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఈ నెల 17వ తేదీ నుంచి శ్రీవారికి ప్రతిరోజూ నిర్వహించే సుప్రభాతం బదులు గోదాదేవి విరచిత తిరుప్పావై పాశురాలు రోజుకొకటి చొప్పున నెల రోజులపాటు మొత్తం 30 పాశురాలను వేద పండితులు పారాయణం చేస్తారు. ఈ నెల రోజులపాటు గర్భాలయంలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తారు. భగవంతుడు నిద్ర నుండి మేల్కొని సర్వజగత్‌సృష్టిని లయబద్ధంగా నడిపించడానికి ఈ ధనుర్మాసం నుంచి శ్రీకారం చుడతారని పురాణ ప్రసిద్ధి. ధనుర్మాసం అంటే దివ్యప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఆండాళ్‌ అమ్మవారి పూజ, తిరుప్పావై పఠనం, గోదా కల్యాణం ప్రసాదాలు మొదలైనవి ధనుర్మాసంలోనే నిర్వహిస్తారు. 2018 జనవరి 15వ తేదీ నుంచి యథావిధిగా సుప్రభాత సేవ జరుగుతుంది. 


  

>
మరిన్ని వార్తలు