టీడీపీ దౌర్జన్యం.. ఎమ్మెల్యేతో కలిసి పోలీసులకు ఫిర్యాదు

22 Jun, 2020 07:40 IST|Sakshi
బాధితురాలితో కలిసి తాలూకా సీఐ ఓబులేసుకు సమస్యను వివరిస్తున్న కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌ సుధాకర్‌

నాడు–నేడు పనులు తామే చేస్తామని, అడ్డు వస్తే అంతు చూస్తామని బెదిరింపులు 

పోలీసులను ఆశ్రయించిన పేరెంట్స్‌ కమిటీ సభ్యురాలు సుజాత

సాక్షి, కర్నూలు ‌: అధికారం కోల్పోయినా టీడీపీ నాయకుల ఆగడాలు ఆగడం లేదు. ప్రభుత్వమేదైనా అభివృద్ధి పనుల కాంట్రాక్ట్‌ తామే తీసుకుంటామని, అడ్డొస్తే అంతమొందిచేందుకు వెనుకాడేది లేదని గ్రామాల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారు. మండల పరిధిలోని ఆర్‌.కొంతలపాడు జెడ్పీ హైస్కూల్‌లో నాడు–నేడు అభివృద్ధి పనుల కింద రూ.40లక్షలు విడుదలయ్యాయి. పనులను పాఠశాల పేరెంట్స్‌ కమిటీకి అప్పగించింది.

దీంతో పేరెంట్స్‌ కమిటీ సభ్యురాలు సుజాత ఆధ్వర్యంలో పాఠశాలకు మరుగుదొడ్లు, ప్రహరీ తదితర పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో శనివారం సాయంత్రం టీడీపీ కోడుమూరు ఇన్‌చార్జ్‌ విష్ణువర్ధన్‌రెడ్డి అనుచరులు సాయికృష్ణ, గిడ్డయ్య పాఠశాల వద్దకు వచ్చి గొడవ పెట్టుకున్నారు. పనులు తామే చేస్తామని, కాదంటే అంతు చూస్తామని బెదిరించి వెళ్లారు. ఆదివారం మరో టీడీపీ నాయకుడు గిరి.. సుజాత ఇంటికి వెళ్లి కాంపౌండ్‌లోని వస్తువులను ధ్వంసం చేసి, చీర లాగి, కులంపేరుతో దూషించాడు. అడ్డొచ్చిన ఆమె మరిది మాసుంపై దాడికి దిగాడు. చదవండి: చంద్రబాబు, రామోజీలకు లీగల్‌ నోటీసు

ఎమ్మెల్యేతో కలిసి బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు 
తమపై దాడి జరిగిందని బాధితురాలు సుజాత, ఆమె మరిది మాసుం కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్‌.సుధాకర్‌ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన స్పందించి బాధితులను వెంటబెట్టుకుని రాత్రి 8 గంటల ప్రాంతంలో కర్నూలు తాలూకా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సీఐ ఓబులేసుకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల నుంచి గ్రామంలో ఘర్షణ జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.   

మరిన్ని వార్తలు