లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు

14 Aug, 2015 01:02 IST|Sakshi

రూ. 2.25 లక్షల జరిమానా
 
విజయవాడ లీగల్ : బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడిన నిందితుడిపై నేరం రుజువు కావడంతో పదేళ్ల జైలుశిక్షతో పాటు, రూ.2,25,000 జరిమానా విధిస్తూ మూడో అదనపు జిల్లా జడ్జి కం ప్రత్యేక న్యాయస్థానం జడ్జి  ఎ.గిరిధర్ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలు ఇలా ఉన్నాయి. న్యూ రాజరాజేశ్వరిపేటకు చెందిన నిందితుడు బొజ్జా సురేష్ తన కుటుంబంతో నివశిస్తున్నాడు. అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో భార్య ఇద్దరి పిల్లలను భర్తను వదలి వెళ్లిపోయింది. అదే ప్రాంతంలో నివశిస్తున్న  దూరపు బంధువైన మైనర్ బాలికపై నిందితుని కన్ను పడింది.ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించి 2013,ఆగష్టు 18న  నాగపట్నం వెళ్లి వద్దామని చెప్పాడు. మరుసటి రోజు  ఇద్దరు కలసి చెన్నై వె ళ్లారు.అక్కడ నుంచి నాగపట్నం  చేరారు.

అక్కడే బాలికను నిందితుడు వివాహం చేసుకున్నాడు. 15 రోజుల పాటు అక్కడే ఉంచి ఆ బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నగరానికి చేరుకున్న బాలిక విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సింగ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ బెల్లపు సత్య నారాయణ 11 మంది సాక్షులను విచారించారు.  విచారణలో నిందితుడిపై నేరం రుజువు కావడంతో కిడ్నాప్‌నకు ఐదేళ్ల  జైలు శిక్ష, రూ.25 వేల జరిమానా, లైంగిక దాడికి పదేళ్ల జైలుశిక్ష తోపాటు, రూ. 2 లక్షలు జరిమానా విధిస్తూ,శిక్ష ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు.
 
 

మరిన్ని వార్తలు