రాజకీయాలపై ఆలోచించండి: చంద్రబాబు

23 Nov, 2013 02:45 IST|Sakshi
రాజకీయాలపై ఆలోచించండి: చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో ఓటు వేయడానికే పరిమితం కాకుండా రాష్ట్రంలో సుపరిపాలన కోసం మంచి పార్టీకి మద్దతు పలికేలా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రజలలో చైతన్యం కలిగించాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోరారు. ఐటీ నిపుణులు రాజకీయాలు గురించి ఆలోచించాలని ఉద్బోధించారు. రాష్ట్రంలో సుపరిపాలన ఉన్నప్పడే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ‘ప్రజా చైతన్యానికి మీరు నాంది పలకండి. మీ భవిష్యత్‌కు నేను రూపకల్పన చేస్తా’ అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో సైబర్ టవర్స్ నిర్మాణం జరిగి 15 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా చంద్రబాబు శుక్రవారం అక్కడ పర్యటించారు.
 
  సైబర్‌టవర్స్ ప్రాంగణంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి తాను అధికారంలో ఉన్నప్పుడు సైబర్ టవర్స్ నిర్మాణం కోసం చేసిన కృషిని వివరించారు. 15 ఏళ్ల క్రితం ఇదే రోజు తాను, అప్పటి ప్రధాని వాజపేయి ఈ కార్యక్రమానికి నాంది పలికామన్నారు. ఈ నిర్మాణం ఇప్పుడు తనకెంతో తృప్తినిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌లో ఐటీ రంగం విస్తరణకు 15 రోజుల పాటు అమెరికాలో పర్యటించానన్నారు. గతంలో హైదరాబాద్ అంటే చార్మినార్ గుర్తుగా ఉండేదని.. ఎన్టీ రామారావు వచ్చాక బుద్ధ విగ్రహం ఆ జాబితాలో చేరిం దని... తాను తొమ్మిదేళ్లలోనే సైబరాబాద్ నిర్మాణం పూర్తి చేసినట్టు చెప్పారు. వైఎస్ రాజశే ఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అభివృద్ధి ఆగిపో యిందని ఆరోపించారు. తాను అనుకున్న విధంగా ముందుకు పోలేదన్నారు. 
 
 సాక్షిపై టీడీపీకి అదే అక్కసు: టీడీపీ మరోసారి సాక్షి దినపత్రికపై అక్కసు వెళ్లగక్కింది. పార్టీ నిర్వహిస్తున్న పత్రికా విలేకరుల సమావేశాలతో పాటు, సమావేశాలకు, కార్యక్రమాలకు సంబంధించి ఈ ఏడాది జూన్ 12 వ తేదీ నుంచి సాక్షి దినపత్రిక, టీవీ చానల్‌కు ఎలాంటి ఆహ్వానాలు పంపడం లేదని తెలిపింది. అయినప్పటికీ వైఖరి మార్చుకోకుండా తమ పార్టీకి సంబంధించిన వార్తలు ప్రచురిస్తున్నారని ఆక్రోశం వెలిబుచ్చింది. పార్టీ ఉపాధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ పేరిట శుక్రవారం రాత్రి ఒక ప్రకటనను తెలుగుదేశం రాష్ర్ట కార్యాలయం విడుదల చేసింది. పార్టీ నిర్వహించే విలేకరుల సమావేశానికి సాక్షి ప్రతినిధి హాజరు కాకపోయినప్పటికీ వార్తలు ప్రచురిస్తూ... మా విలేకరి వస్తే ఈ ప్రశ్నలు అడిగేవారంటూ ప్రశ్నలు వేస్తోందని పేర్కొంది.
మరిన్ని వార్తలు