శ్రీకాకుళం సిటీ: అసలే పరీక్షల సమయం.. ఆపై హాస్టల్ గదిలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యచేసుకున్న సంఘటన స్థానికంగా సంచలం రేకెత్తించింది. ఈ ఘటన శ్రీకాకుళం రూరల్ మండలంలో కళాశాలలో శనివారం ఉదయం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. కళాశాలలో సీనియర్ ఇంటర్ చదువుతున్న ముప్పాన సాయిరాజ్ (17) తువ్వాలుతో ఉరిపోసుకొని హాస్టల్గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సాయిరాజ్ కొంత కాలంగా కడుపుల నొప్పితో బాధపడుతూ, మందులు కూడా వాడుతున్నాడని కళాశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కడుపునొప్పి తాళలేక ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని ఆయన అన్నారు.
మృతుని వివరాలు ఇలా...
కోల్కతా టిటాగర్కు చెందిన సాయిరాజ్ తల్లిదండ్రులు దేవరాజ్, విజయల ప్రోత్సాహంతో ఇక్కడి కళాశాలలో ఇంటర్మీడియెట్ చదివేందుకు గత ఏడాది చేరాడు. తండ్రి అక్కడి బోంబేడయింగ్ షోరూంలో సేల్స్మన్గా పనిచే స్తుండగా, తల్లి ఇంటిదగ్గర ట్యూషన్లు చెబుతుంటారు. సాయిరాజ్ పదోతరగతి వరకు టిటాగర్లోని ఆంధ్రవిద్యాలయంలో పదోతరగతి వరకూ చదివాడు. సాయిరాజ్ మేనమామ కుమారుడు శ్రీసాయి కూడా ఇక్కడి కళాశాలలోనే ఇంటర్మీడియెట్ చదువుతున్నాడు. కళాశాల హాస్టల్ గదిలో వీరిద్దరితోపాటు మరో 12 మంది ఉంటున్నారు. సీనియర్ ఇంటర్మీడియెట్ నాలుగు పరీక్షలను సాయిరాజ్ రాశాడు. అయితే శనివారం ఉదయం 6 గంటల నుంచి 7.30 వరకు కళాశాలలో స్టడీ అవర్స్ జరుగుతుండగా బాత్రూంకు వెళ్లివస్తానని చెప్పి హాస్టల్ గదిలో సాయిరాజ్ ఆత్మహత్యకు పాల్పడినట్టు ప్రిన్సిపాల్ తెలిపారు.
ఆటోలో రిమ్స్కు..
ఆత్మహత్యకు పాల్పడిన సాయిరాజ్ను ఆటోలో శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. అప్పటికే సాయిరాజ్ మృతి చెందినట్టు రిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. కాగా, శ్రీకాకుళంలోని ఓ వివాహానికి కోల్కతా నుంచి స్నేహితులతో వచ్చిన మృతుని మేనమామ పడాల రామారావు జరిగిన ఘటనపై కన్నీటిపర్యంతమయ్యారు. విషయాన్ని అతని కుమారుడు శ్రీసాయి ద్వారా తెలుసుకున్నారు. శ్రీకాకుళంలో శనివారం వేకువజామున జరిగిన వివాహానికి తాను కలకత్తా నుంచి వచ్చినట్టు మృతుని మేనమామ రామారావు విలేకరులకు తెలిపారు. ఇంతలో జరగరాని సంఘటన జరిగిందని బోరున విలపించారు.
రిమ్స్లో పోలీసులు
విద్యార్థి ఆత్మహత్య సమాచారం తెలుసుకున్న ఒకటో పట్టణ సీఐ అప్పలనాయుడు, రూరల్ ఎస్ఐ మధుసూదనరావు, ఏఎస్ఐ శ్రీనివాసరావు రిమ్స్కు చేరుకున్నారు. జరిగిన సంఘటనపై కళాశాల యాజమాన్య ప్రతినిధులు, బాధితుల నుంచి వివరాలను సేకరించారు. ఘటనకు కారణాలపై ఆరా తీశారు. రిమ్స్లో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతుని మేనమామ రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు రూరల్ పోలీస్ ఎస్ఐ మధుసూదనరావు తెలిపారు.
పాతపట్నం: మండలంలోని సీతారాంపల్లి, చిన్నలోగిడి మధ్యలో శనివారం మధ్యాహ్నం రైలు కింద పడి పాతపట్నం ఎస్సీ వసతి గృహంలో ఉంటున్న తొమ్మిదో తరగతి విద్యార్థిని నడగాన స్వాతి (14) ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు, స్నేహితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వారివీధిలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఉదయం ఏడున్నరకు స్వాతి బయలు దేరి వెళ్లింది. మధ్యాహ్నం విరామ సమయంలో పుస్తకాలు విడిచిపెట్టి ఆమె బయటకు వెళ్లిపోయింది. పాఠశాల నుంచి వెళ్లిన స్వాతి రైలు కింద పడి మృతి చెందింది. స్థానికుల సమాచారంతో మృత దేహాన్ని 108లో స్థానిక సామాజిక ఆస్పత్రికి తరలించారు. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియలేదు.
నాలుగు సంవత్సరాలుగా వసతి గృహంలో...
ఎల్.ఎన్.పేట మండలం యంబరాం పంచాయతీలోని బొడ్డవలస గ్రామానికి చెందిన నడగాన ఆనందరావు, గంగ దంపతుల కుమార్తె స్వాతి. పాతపట్నం ఎస్సీ వసతి గృహంలో ఆరో తరగతి నుంచి చదువుతోంది. చదువులో రాణిస్తుందని మెట్రిన్ జి.విజయలక్ష్మి తెలిపారు. సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు తెలియజేశామన్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ లక్ష్మీనృసింహం వెంటనే వసతిగృహ డీడీ ధనుంజయరావు, ఎంపీడీఓ ఎ.జగదీశ్వరావు ఆస్పత్రికి పంపించారు. మృతికి గల కారణాలు, వివరాలు నమోదు చేసుకోవాలని ఆదేశించారు. పలాస రైల్వే జీఆర్పీ ఎస్ఐ కె.మధుసూదనరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎస్సీ వసతి గృహాన్ని డీడీతో పాటు, ఎంపీడీఓ, రైల్వే ఎస్ఐ సందర్శించి తోటి విద్యార్థినుల నుంచి వివరాలు సేకరించారు.
వారికి ఏ కష్టం వచ్చిందో...తల్లిదండ్రులకు గానీ, తోటి స్నేహితులకు గానీ చెప్పుకోలేదు. హాయిగా చదువుకొనే వారు మృత్యువును ఆహ్వానించారు. వసతి గృహాల్లో తమ పిల్లలు ప్రశాంతంగా చదువుకొంటున్నారనుకున్న తల్లిదండ్రులకు శోకం మిగిల్చారు. తరగతుల మధ్యలో వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డారు. జిల్లాలోని ప్రైవేటు కళాశాల్లో చదువుతున్న విద్యార్థి ఒకరైతే, పాతపట్నంలోని ఎస్సీ వసతి గృహానికి చెందిన అభంశుభం తెలియని తొమ్మిదో తరగతి విద్యార్థిని మరొకరు.