దద్దమ్మలం కాదు.. అడ్డుకుని తీరుతాం: జూపూడి

16 Dec, 2013 11:28 IST|Sakshi
దద్దమ్మలం కాదు.. అడ్డుకుని తీరుతాం: జూపూడి

మండలిలో సెక్రటరీ నోట్ చదివితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించిందని పార్టీ నాయకుడు, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు చెప్పారు. ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. బిల్లును మండలిలో పంచకుండా తమ నిరసనను తెలిపామన్నారు. వివిధ పార్టీలకు చెందిన ఇతర మిత్రులు కూడా తమకు సహకరించారని ఆయన చెప్పారు. శ్రీనివాసులు నాయుడు, నన్నపనేని రాజకుమారి కూడా మద్దతు చెప్పారన్నారు. సమైక్యాంధ్ర మాత్రమే కావాలని, ఆమేరకు తీర్మానం చేయాలని తాము అడిగినా పట్టించుకోకుండా ఎవరో రాసిన తీర్మానం ప్రతిని తెస్తామంటే తాము దద్దమ్మలం కాదని జూపూడి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ తీర్మానాన్ని అంగీకరించేది లేదన్నారు. బిల్లును పంచారని, దాన్ని తగలబెట్టారని అంటున్నారని.. పెద్దల సభలో మాత్రం ఇది అన్యాయమని ఎలుగెత్తి చాటుతామన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తమ పార్టీ అధ్యక్షుడు దేశవ్యాప్తంగా పర్యటించి అందరినీ కోరారని చెప్పారు. రాష్ట్రంలో 75 శాతం మంది ప్రజలు సమైక్యంగా ఉంచాలని కోరుకుంటుండటం వల్లే తాము విభజనను వ్యతిరేకిస్తున్నామన్నారు. కౌన్సిల్లో తమ వాదన గట్టిగా వినిపించినట్లు చెప్పారు.

సీడబ్ల్యుసీ నుంచి వచ్చినా, రాష్ట్రపతి నుంచి వచ్చినా దీన్ని ఆమోదించేది లేదన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను తాము చదువుకున్నట్లు వాళ్లు చదువుకున్నారో లేదో అడగాలని చెప్పారు. అసలు డిమాండ్ ఉన్న రాష్ట్రాలన్నింటినీ వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకుంటున్నారన్నారు. ఏ సంప్రదాయాలను రుద్దాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఇది అప్రజాస్వామికమని విమర్శించారు. రాజకీయ అవకాశాలకు కౌన్సిల్ వేదిక కాదని, కారాదని, దీన్ని వ్యతిరేకించి తీరుతామని అన్నారు. చేతనైతే దీన్ని కౌన్సిల్లో చర్చించాలని, తమ హక్కులను కూలదోసి ఎక్కడినుంచో వచ్చిన తీర్మానాన్ని చర్చించాలంటే సహించేది లేదన్నారు.

మరిన్ని వార్తలు